హాట్ న్యూస్ : రాజమౌళి ‘బహుబలి’లో శ్రీదేవి
హైదరాబాద్ : మగధీర, ఈగ లాంటి అద్భుతమైన చిత్రాలు రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా 'బహుబలి' అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో మరో హీరో రాణా విలన్ పాత్ర పోషిస్తున్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా భారీ యుద్ధసన్నివేశాలతో కూడిన పీరియడ్ డ్రామా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మాజీ స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి లేదా సుస్మితా సేన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీదేవి లేదా సుస్మితాసేన్ ఈ చిత్రంలో ప్రభాస్, రాణా తల్లి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వీరికి రెమ్యూనరేషన్ కోటికిపైగానే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సినిమాను 70 నుంచి 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని డిసైడ్ అయిన నిర్మాత దేవినేని ప్రసాద్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదని, వారిని తీసుకోవడానికి రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
కాగా..ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











