మోహన్కృష్ణకు మరో అవార్డు
ప్రఖ్యాత రచయిత చలం రాసిన దోషగుణం కథను గ్రహణం పేరుతో తెరకెక్కించి తొలి చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డును అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మకమైన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రదానోత్సవం శనివారం సాయంత్రం (ఆగస్టు 12న) చెన్నైలో ఘనంగా జరిగింది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉత్తమ దర్శకుడు మోహనకృష్ణను ఘనంగా సత్కరించారు.
తన మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి గొల్లపూడి శ్రీనివాస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి తమ కుమారుడి స్మారకంగా గొల్లపూడి మారుతీరావు ప్రతి యేటా జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి చిత్ర దర్శకులకు ఈ అవార్డును, లక్షన్నర రూపాయల నగదును అందజేస్తున్నారు. గ్రహణం చిత్రంతో చక్కని ప్రతిభ కనబర్చిన మోహనకృష్ణను ఈ ఏడాది ఎంపిక చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన అనేకమంది ప్రముఖులు, బాలీవుడ్ నిర్మాత రమేశ్ సిప్పి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ అవార్డుకు అర్హత సాధించడం, ఆపై తన అభిమాన నటుడైన అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం తనకు మధురానుభూతి మిగిల్చిందని ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications