‘కెమెరామెన్ గంగతో రాంబాబు’పై సర్కారు జోక్యం, కమిటీ
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగడం, ఈచిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కార్యాలయం, ఇంటిపై దాడుల నేపథ్యంలో ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది.
సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులపై విచారణ జరిపి తొలగించేందుకుగాను రాష్ట సమాచార శాఖ మంత్రి డి.కె. అరుణ ఎఫ్.డి.సి కమిటీ వేసారు. సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ తొలగించాలని ఆదేశించారు. అయితే తెలంగాణ వాదులు మాత్రం సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలని, సినిమా అంతా ఓకే అంశం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో కొన్ని డైలాగులు, సీన్లు తొలగించినంత మాత్రాన తాము సంతృప్తి పడబోమని అంటున్నారు.
అయిటే రాష్ట్ర ప్రభుత్వం ఇటు నిర్మాతకు నష్టం కలుగకుండా, అటు తెలంగాణ వాదుల మనోభావాలు దెబ్బతినకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా.... దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్న మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచేందుకు ఈచిత్రాన్ని రూపొందించలేదని, ఎవరినైనా ఇబ్బంది పెట్టే అంశాలు చిత్రంలో ఉంటే వెంటనే తొలగిస్తామని చెప్పారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా అలాంటి సీన్లను తొలించిన తర్వాతే సినిమా ప్రదర్శిస్తామని హామీ ఇచ్చారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగులు, సన్నివేశాలు..... కెసిఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ తీరును కించ పరిచే విధంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల ఈ చిత్రం రీళ్లను దగ్ధం చేయడంతో పాటు, ప్లెక్సీలు, కటౌట్లు, పోస్టులు ధ్వంసం చేసారు.
మరో వైపు హైదరాబాద్లో ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీసుపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై కూడా కొందరు దాడికి ప్రయత్నించారు. ఈ ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈచిత్ర ప్రదర్శన కొన్ని చోట్ల నిలిపివేసారు.


Click it and Unblock the Notifications











