నిజమే 'దేనికైనా రెడీ'లో అభ్యంతరకర సన్నివేశాలు: కమిటీ
హైదరాబాద్ : వివాదంలో చిక్కుకొన్న 'దేనికైనా రెడీ' సినిమాను ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం సాయంత్రం వీక్షించింది. దేనికైనా రెడీ సినిమాలో 20 అభ్యంతరకర సన్నివేశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. ఈ రోజు నిర్మాత మోహన్బాబును కలిసి ప్రభుత్వ కమిటీ అభిప్రాయం తీసుకోనుంది. కమిటీని సవాల్ చేస్తూ హైకోర్టులో మోహన్బాబు పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్బాబు పిటిషన్లో పేర్కొన్నారు.
అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్ రేమండ్ పీటర్ తెలిపారు. కమిటీతో పాటు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కూడా సినిమాను తిలకించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరవాత సమగ్ర నివేదికను ఈ నెల పదో తేదీలోగా ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు.
అలాగే చిత్ర పరిశ్రమకు కూడా కొన్ని సూచనలివ్వాలని కమిటీ భావిస్తోందని, కుటుంబ సమేతంగా సినిమాలు నిర్మించాలన్నది తమ అభిమతమని ఆయన చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమాను ఎలా చూడాలనుకుంటారో, నిర్మాతలు కూడా అలాగే తీయాలని చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు సూచనలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
'దేనికైనా రెడీ'పై అభ్యంతరాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కమిటీ అధ్యక్షులుగా సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











