దాసరి, జయలలితకు ఘన నివాళి.. ఇఫీలో మేఘ సందేశం ప్రదర్శన
భారతీయ సినిమాకు విశేష సేవలందించిన దివంగత సినీ ప్రముఖులకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ2017) ఘనంగా నివాళులర్పించనున్నామని ఫెస్టివల్ డైరెక్టర్ సునిత్ టాండన్ వెల్లడించారు.
Recommended Video

భారతీయ సినిమాకు విశేష సేవలందించిన దివంగత సినీ ప్రముఖులకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ2017) ఘనంగా నివాళులర్పించనున్నామని ఫెస్టివల్ డైరెక్టర్ సునిత్ టాండన్ వెల్లడించారు. సినీ ప్రముఖులను భారతీయ చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విషాదకరం. వారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఇఫీ వారి సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటుంది అని టాండన్ ఓ ప్రకటనలో తెలిపారు.

దివంగత ప్రముఖులకు నివాళి
ఇఫీ నివాలర్పించే జాబితాలో ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, ఓం పురి, వినోద్ ఖన్నా, టామ్ అల్టర్, రీమా లాగూ, జయలలిత, అబ్దుల్ మజీద్, కుందన్ సా, రామానంద్ సేన్ గుప్తా (సినిమాటోగ్రాఫర్) ఉన్నారు.

ప్రదర్శించే చిత్రాలు ఇవే..
ఇఫీలో దాసరి నారాయణరావు రూపొందించిన మేఘ సందేశం, ఓంపురి నటించిన అర్థసత్య, వినోద్ ఖన్నా నటించిన అచానక్, జానే భీ దో యారో, షా, అల్టర్ రూపొందించిన ఓషియన్ ఆఫ్ యాన్ ఓల్డ్ మ్యాన్, రిమా లాగూ నటించిన సవాలీ, జయలలిత నటించిన అయిరాథిల్ ఒరువన్, మజీద్ రావు రూపొందించిన చమేలీ మేమ్సాబ్ తదితర చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఇఫీలో మరోసారి మేఘ సందేశం
1982లో మేఘ సందేశం చిత్రాన్ని దాసరి నారాయణరావు తారక ప్రభు ఫిలింస్ బ్యానర్పై రూపొందించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు. రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఈ చిత్రం నాగేశ్వరరావు కెరీర్లో 200వ చిత్రం.

మేఘ సందేశం కథ ఇదే..
రవీంద్రబాబు (అక్కినేని నాగేశ్వరరావు) సహజకవి. చాలా సాదాసీదా అమ్మాయి పార్వతి (జయసుధ)ను పెళ్లాడుతాడు. ఓ కవిగా రవీంద్రబాబు తన భార్యను నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందలేకపోతాడు. ఆ క్రమంలో పద్మ (జయప్రద) అనే నటితో పరిచయం ఏర్పడుతుంది. పద్మాను ఆరాధించడం మొదలుపెట్టిన రవీంద్రబాబును భార్య పార్వతి అపార్థం చేసుకొంటుంది. పద్మను ఓ వేశ్యవృత్తి నుంచి వచ్చిన యువతి అని పార్వతి భావిస్తుంది. దాంతో రవీంద్రబాబు చాలా మనోవేదనకు గురవుతాడు. దాంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ పద్మపై ఉన్న ప్రేమను ప్రకృతికి, మేఘాలకు కవితాధోరణిలో చెప్పుకొంటారు. చివరకు భార్యను కలిసి మరణిస్తాడు రవీంద్రబాబు.

అవార్డులు, ప్రశంసల వెల్లువ
మేఘ సందేశం చిత్రానికి జాతీయ అవార్డుల లభించాయి. 9వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, 1983 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్స్లో విశేష ఆదరణ లభించింది. దాసరి నారాయణరావుకు ఉత్తమ దర్శకుడిగా, రమేష్ నాయుడికి ఉత్తమ సంగీత దర్శకుడిగా, సుశీలకు ఉత్తమ గాయనిగా, ఉత్తమ చిత్రంగా జాతీయ, నంది అవార్డులు లభించాయి.


Click it and Unblock the Notifications











