అలా చేస్తే చెప్పుతో కొడుతాం.. అందుకే పవన్ వస్తున్నాడు.. రెచ్చిపోయిన జీవి
Recommended Video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున సినీ నటుడు జీవీ నాయుడు కార్యకర్తల సమావేశంలో విరివిగా పాల్గొంటున్నాడు. గతనెల కార్యకర్తల సమావేశంలో కత్తి మహేశ్పై మండిపడ్డ జీవి సుధాకర్ నాయుడు.. తాజాగా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఊగిపోయాడు. ధర్మవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాజకీయాలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చర్చేనీయాంశమైంది.

కలుషిత రాజకీయాలను..
ధర్మవరం కార్యకర్తల సమావేశంలో జీవీ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత కలుషిత రాజకీయాలను కడిగిపారేసేందుకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు. ధర్మవరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీచోట అంకిత భావం ఉన్న కార్యకర్తలు జనసేనకు ఉన్నారు. నగదు రహిత రాజకీయాలకు వారంతా సిద్ధంగా ఉండాలి. ఎవడైనా ఓటుకు డబ్బు ఇస్తామంటే చెప్పుతో కొట్టాలి అని అన్నారు.

రాజకీయం వారి సొత్తా?
వచ్చే 20 ఏళ్లు మాదే రాజకీయం అంటున్న ఓ పార్టీపై జీవీ నాయుడు నిప్పులు చెరిగాడు. రాజకీయం వారి సొత్తా అని ప్రశ్నించాడు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని యువకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకునే విధంగా జనసేన పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మీలో ఒక యువకుడు, యువతి ఎమ్మెల్యే కావాలి అని ఆయన పిలుపు నిచ్చాడు.

ఓటర్లను మోసం చేస్తున్నది..
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార పార్టీ మోసం చేస్తున్నది. రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం లేదు. అధికార పార్టీ అన్ని రకాలుగా విఫలమైంది.

ప్రజారాజ్యం తప్పులు రిపీట్ కాకుండా
రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధమవుతున్నాడు. ప్రజారాజ్యం చేసిన తప్పులు పునరావృతం కాకుండా పవన్ కల్యాణ్ సరికొత్త రాజకీయాలకు భాష్యం చెప్పబోతున్నాడు అని జీవీ పేర్కొన్నాడు.

రాజకీయాల్లో కొత్త ఒరవడి
రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి జనసేన సైనికులు గ్రామ గ్రామానికి వెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. ప్రతీ ఓటరకు ఓటు విలువను వివరిస్తారు. గాంధీ కలలుకన్న రాజ్యం వైపు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నాడు.

బడుగు, బలహీన వర్గాల కోసం
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. అలాంటి వారికి అండగా నిలువడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అన్ని సమస్యలకు ఓటు సమాధానం కావాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.

పవన్కు ఎంత మండిందో..
ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా కలిపినందుకు ఏకంగా పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు. రాజకీయాల్లో చిరంజీవికి జరిగిన అన్యాయానికి మనకే కడుపు మండిపోతుంటే.. పవన్ కల్యాణ్కు ఎంత మండుతుందో చెప్పండి అని జీవీ ఊగిపోయారు.

ఎమ్మెల్యేలు గన్మెన్లతో
కాపులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నారంటే వారికి మనమంటే ఎంత భయం ఉందో చూసుకొండి. కాపులు ఎలాంటి వారో రాజకీయ నాయకులు పక్కాగా తెలుసు. అందుకే మనకు భయపడుతున్నారు. నేను తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన స్వచ్ఛమైన కాపుని. కాపుల ప్రయోజనాల కోసం చచ్చేదాక పోరాడుతాను అని జీవి అన్నారు.

ఎవరికీ భయపడం.. లెక్క చేయం
పవన్ కల్యాణ్ విషయంలో ఎవరికీ భయపడేది లేదు. ఎవరినీ లెక్కచేసేది లేదు. జనసేన కోసం ఎంతకైనా తెగిస్తాను. మనం ఏదనుకుంటే అదే చేయాలి అని జీవీ అన్నారు.


Click it and Unblock the Notifications











