సీక్వెల్ మాత్రమే కాదు...ఆస్కార్ లైబ్రరీలో చోటు
ముంబై :షారుఖ్ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు తిరగ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.350కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకొంది.
ఈ సినిమా స్క్రీన్ప్లేను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తన శాశ్విత జాబితాలోకి అధికారికంగా తీసుకొంది. సినిమా రంగానికి చెందిన విద్యార్థులు, ఫిల్మ్మేకర్స్, రచయితలు, నటుల పరిశోధన కోసం స్క్రీన్ప్లేలను ఈ సంస్థ భద్రపరిచి ఉపయోగిస్తుంది. ఇప్పటివరకు 11,000 స్క్రిప్టులను ఈ సంస్థ లైబ్రరీలో ఉంచింది. 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరాఖాన్ దర్శకురాలు.
అతి తక్కువ రోజుల్లో రూ.100కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే రూ.200కోట్ల క్లబ్లో చేరనుంది. ఈ చిత్రం విడుదలై 15రోజులవగా, ఇప్పటి వరకు రూ.194కోట్ల వసూళ్లు సాధించింది. కొద్దిరోజుల్లోనే రూ.200కోట్ల వసూళ్లను సాధిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చెన్నై ఎక్స్ప్రెస్ తరువాత రూ.200కోట్ల క్లబ్లో చేరిన రెండో షారూఖ్ చిత్రంగా 'హ్యాపీ న్యూ ఇయర్' రికార్డులకెక్కనుంది.
మరో ప్రక్క హ్యాపీ న్యూఇయర్ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలంటూ తాను, ఆ చిత్ర బృందం దర్శకురాలు ఫరాఖాన్పై ఒత్తిడి తెస్తున్నట్లు అభిషేక్ బచ్చన్ తెలిపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'.
ఈ చిత్రంలో అభిషేక్ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ సమయలో చిత్రబృందం అంతా కలిసి చాలా ఆనందంగా గడిపామని, మళ్లీ కలిసి పనిచేయడానికి ఉవ్విళ్లూరుతున్నామని, అందుకే దీనికి సీక్వెల్ తీయమని ఫరాఖాన్ని కోరుతున్నామని అభిషేక్ తెలిపారు.

ఒక్కసారి 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటించినందుకే తన కొడుకుపై అసంతృప్తి వ్యక్తం చేసింది అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్. ఇప్పుడు అభిషేక్ 'హ్యాపీ న్యూ ఇయర్'కు సీక్వెల్ కావాలంటున్నాడు. కొనసాగింపు తీయాలని దర్శకురాలు ఫరాఖాన్పై చిత్రబృందమంతా ఒత్తిడి తీసుకొస్తున్నామని చెబుతున్నారు అభిషేక్ బచ్చన్.
''ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని చిత్రబృందం అందరూ కోరుకొంటున్నారు. చిత్రీకరణ జరిగినంతసేపు చాలా ఎంజాయ్ చేశాం. ఈ సినిమా ఓ మర్చిపోని జ్ఞాపకం. ప్రస్తుతం ఫరా కాస్త విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆ తర్వాత ఆమె కథ సిద్ధం చేసుకొంటే మళ్లీ ఒత్తిడి చేయడం మొదలుపెడతాం. 'సినిమాలకు కొంచెం బ్రేక్ ఇస్తాను. ప్రస్తుతం ఫుట్బాల్ టీమ్పై దృష్టిపెడతాను''అని చెప్పాడు అభిషేక్.
చిత్రం కథేమిటంటే...
మూడు వందల కోట్ల విలువైన వజ్రాలను ఓ ఇండిస్ట్రియలిస్ట్ చరణ్ గ్రోవర్(జాకీ ష్రాఫ్) నుంచి చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ ఛార్లీ(షారూఖ్) కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తమకు సహకరించే ప్రొఫిషనల్స్ తో కూడిన ఓ టీమ్ కావాల్సి వస్తుంది. ఆ టీమ్ లో ...నందూ భిఢే(అభిషేక్ బచ్చన్),జాక్(సోనూ సూద్), మోహిని(దీపిక),రోహన్(వివాన్ షా), టామీ(బొమన్ ఇరానీ)లను ఎంపిక చేస్తాడు.
అక్కడ నుంచి వారందరినీ తీసుకుని తన ప్లాన్ ప్రకారం...దుబాయి లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్ కు వెళ్తాడు. ఆ పోటీ హడావిడిలో అందరూ ఉండగా... ఆ వజ్రాలను లేపేయటానికి స్కెచ్ వేస్తాడు. ఎందుకు చార్లీ ఇలా దొంగతనానికి సిద్దపడ్డాడు..ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి... అనుకున్నట్లుగా అక్కడ వజ్రాలు దొరికియా...వంటి సమధానాలు తెలియాలంటే... 'హ్యాపీ న్యూ ఇయర్' చూడాల్సిందే. ఆరుగురు దొంగ డ్యాన్సర్లు చేసే సందడే ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











