విషాదంలో టాలీవుడ్: స్తంభించిన కార్యకలాపాలు...అఖిల్, చైతూ, విశాల్ సినిమాపై ఎఫెక్ట్!
ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బుధ, గురు వారాల్లో జరుగాల్సిన సినిమా ప్రెస్ మీట్స్ అన్నీ రద్దు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలు షూటింగులకు సైతం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినీ స్టార్స్ అంతా హరికృష్ణ చివరి చూపు కోసం మెహదీపట్నంలోని ఆయన నివాసానికి వెళుతున్నారు. తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను పలువురు స్టార్స్ కలిసి పరామర్శించారు. మరో వైపు ఈ రోజు జరుగాల్సిన నాగార్జన బర్త్ డే వేడుకలు కూడా రద్దయ్యాయి.
ఆగిపోయిన అఖిల్ మూవీ ఫస్ట్ లుక్
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫస్ట్లుక్ ఈ రోజున నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే నందమూరి హరికృష్ణ మరణంతో ఫస్ట్ లుక్ రిలీజ్ ఆపేశారు.
శైలాజా రెడ్డికి మరోసారి
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా హరికృష్ణ మరణంతో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్న వాయిదా వేశారు. నాగార్జున సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వాజ్పేయి మరణించినపుడు కూడా సాంగ్ రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

‘పందెం కోడి 2' ట్రైలర్ రిలీజ్ నిలిపివేత
విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న 'పందెం కోడి 2' సినిమా రిలీజ్ దసరాగాకు ప్లాన్ చేశారు. ప్రమోషన్స్లో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా హరికృష్ణ మరణంతో ఇది కూడా ఆగిపోయింది.

అరవింద సమేత
మరో వైపు జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘అరవింద సమేత' షూటింగ్.... ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణంతో కొన్ని రోజుల వరకు బ్రేక్ పడినట్లయింది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ వెంటే ఉన్నారు.


Click it and Unblock the Notifications











