హరికృష్ణ మృతి: కన్నీటి పర్యంతమవుతూ ఆసుపత్రికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!
Recommended Video

నందమూరి హరికృష్ణ నేటి ఉదయం నల్గొండ సమీపంలో అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని శోకం ఎదురుకావడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కామినేని ఆసుపత్రి వద్ద
ప్రమాదం జరిగిన వెంటనే హరికృష్ణని హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయన శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ హరికృష్ణ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీనితో ఆసుపత్రికి అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

ఆసుపత్రికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కొద్ది సేపటిక్రితమే కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తీవ్ర శోకంతో కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. అభిమానులతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

అసలు ప్రమాదం ఎలా
హరికృష్ణతో పాటు మరో నలుగురు కూడా ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరులో జరిగే పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం ఉదయం హరికృష్ణ బయలుదేరారు. నల్గొండ సమీపంలో కారు వేంగంగా ప్రయాణిస్తుండగా డివైడర్ ని ఢీ కొట్టి అదుపుతప్పినట్లు తెలుస్తోంది.

కారులోనుంచి బయటకు
తీవ్రమైన ప్రమాదం కావడంతో కారు ఒక్కసారిగా బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. అదుపు తప్పి హరికృష్ణ కారు నుంచి బయటకు పడిపోవడంతో గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో హరికృష్ణ వాహనాన్ని వేరే వాహనం ఏదైనా ఢీ కొట్టిందా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











