‘గద్దలకొండ గణేష్’కు ఏడాది.. నమ్మినందుకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ ఎమోషనల్
హరీష్ శంకర్ సినిమాలు, హీరోలను తెరపై చూపించే విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన అతికొద్ది మంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాలు హరీష్ శంకర్లోని ప్రతిభను చాటుతాయి. గబ్బర్ సింగ్ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయాడు. అయితే రామయ్య వస్తావయ్య వంటి డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆపై తమిళ చిత్రం జిగర్తాండను తెలుగులో గద్దలకొండ గణేష్గా రీమేక్ చేశాడు.
వరుణ్ తేజ్ను కొత్తగా చూపెడుతూ.. విలన్ పాత్రలో అదిరిపోయేలా చేశాడు. నేటికి ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతోంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ ఎమోషనల్ అవుతున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కర్నీ పేరు పేరునా తలుచుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, ఇలా అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాడు. వరుణ్ తేజ్, పూజా హెగ్డేలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. ఈ మేరకు హరీష్ శంకర్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

థ్యాంక్స్ మైడియర్ వరుణ్ తేజ్.. నాపై ఎంతో నమ్మకం ఉంచావ్.. నీ అనితర సాధ్యమైన అంకితభావంతో నన్ను కదిలించావ్.. నా కెరీర్లో నిలిచిపోయే ఈ అద్భుత చిత్రం వచ్చి ఇంతలోనే ఏడాది అయిందంటే నమ్మలేకపోతోన్నా.. లవ్యూ హీరో అంటూ వరుణ్ తేజ్పై ప్రశంసలు కురిపించాడు. ఇక పూజా హెగ్డేపై కామెంట్ చేస్తూ.. నా శ్రీదేవీలా నటించినందుకు థ్యాంక్స్ పూజా హెగ్డే. స్నేహితురాలితో కలిసి పని చేయడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది..ఈ సినిమా కోసం నీవు చేసిన కృషిని మరిచిపోలేను. నీ అద్భుతమైన నటన ఎప్పుడూ గుర్తుండిపోతుంది.. అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











