పద్మశ్రీ వివాదం: మోహన్ బాబుకు ఎదురుదెబ్బ
హైదరాబాద్: తెలుగు నటుడు మోహన్ బాబు 'పద్మశ్రీ' వివాదంపై మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ వివాదంపై నాలుగు వారాల్లో కేంద్ర హోంశాఖకు నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది. పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలా? వద్దా? అనే దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని, అప్పటి వరకు మోహన్ బాబు 'పద్మశ్రీ'ని తన ముందు వాడొద్దని పేర్కొంది.
మోహన్ బాబు 'పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారని, ఆ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కోర్టులో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపి నేత ఇంద్రసేనా రెడ్డి రాష్ర్ట హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో మోహన్ బాబు అవార్డు దుర్వినియోగం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. మరి తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు వివరాలు...
బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మోహన్ బాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ పంపారు. మోహన్ బాబు తన లెటర్ పాడ్లలో , లేదా ఉత్తరప్రత్తురాలలో కేంద్ర ప్రభుత్వం రెండువేల ఏడులో ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో కూడా మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ అని వేసారు. పేరుకు ముందు లేదా తర్వాత పద్మశ్రీ బిరుదును ప్రస్తావించి ఇతర ప్రయోజనాలకు వాడుకోరాదని గతంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిందని, కాని మోహన్ బాబు అందుకు విరుద్దంగా చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మోహన్ బాబు వాదన ఇలా...
'దేనికైనా రెడీ' చిత్రంలో తమ ప్రమేయం లేకుండా పేర్ల ముందు పద్మశ్రీ వాడారని మోహన్ బాబు విన్నవించడంతో సినిమా నుండి పద్మశ్రీ తొలగించాలని, ప్రమేయం లేకుండా పద్మశ్రీ వాడిన విషయమై అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు కోరింది. అనంతరం పద్మశ్రీని తొలగించిన విషయం కోర్టుకు విన్నవించారు. ఇంద్రసేనా రెడ్డి మరో వాదన తెరపైకి తెచ్చారు. 'ఝుమ్మందినాధం' చిత్రంలో తెలిసే 'పద్మశ్రీ' వాడారని ఆయన కోర్టుకు తెలిపారు.


Click it and Unblock the Notifications











