దేనికైనా రెడీ: నిర్మాతకు, సెన్సార్ బోర్డ్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు 'దేనికైనా రెడీ' సినిమా నిర్మాతకు, సెన్సార్ బోర్డుకు బుధవారం నోటీసులు జారీ చేసింది. దేనికైనా రెడీ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఈ రోజు నిర్మాత మోహన్ బాబు, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.
కాగా మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన 'దేనికైనా రెడీ' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు నిరసనబాట పట్టడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. చిత్రాన్ని చూసిన కమిటీ సభ్యులు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. నిర్మాత వాదనలను కూడా విని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఇంతలోపే మోహన్ బాబు హై కోర్టును ఆశ్రయించడంతో కథ మళ్లీ మలుపు తిరిగింది. ఇంతకు ముందు హైకోర్టు.... మోహన్ బాబుకి మద్దతుగా తీర్పునిచ్చింది. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలున్నాయంటూ సర్కార్ కమిటీ వేయడాన్ని తప్పు పట్టింది... అసలు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాక కమిటీలెందుకని ప్రశ్నించింది. దేనికైనా రెడీతో పాటు ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల సమీక్షా కమిటీ నియామకంపై హైకోర్టు స్టే విధించింది.
శుక్రవారం హైకోర్టు స్టే ఇచ్చిన కొద్ది గంటల్లోపే మరో పిటీషన్ హైకోర్టులో దాఖలైంది. 'దేనికైనా రెడీ' సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని రఘునాథరావు అనే లాయర్ కోర్టుకెక్కారు. సినిమా మొత్తం ఒక కులం వారిని కించ పరిచే విధంగా ఉందని, సెన్సార్ బోర్డు సభ్యులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ ఇచ్చారని, అది పూర్తిగా అవకతవకలతో కూడిన సెన్సార్ సర్టిఫికెట్ అని రఘునాథరావు తన పిటీషన్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











