చిరు, రామ్ చరణ్ సినిమాల్లో....అవి నేను చేయాల్సివే: రాజశేఖర్
విలన్ పాత్రలైనా చేయడానికైనా సై అంటున్నారు హీరో రాజశేఖర్. ధృవ సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చిందని తెలిపారు.
హీరో రాజశేఖర్, చిరంజీవికి మధ్య ఉన్న విబేధాల గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి ఠాగూర్ సినిమా సమయంలో ఏర్పడిన చిన్న వివాదం వీరి మధ్య విబేధాలు పెరగడానికి కారణం అయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడ్డాయనే చెప్పొచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.
అంతే కాదు తాను కేవలం హీరో పాత్రలు మాత్రమే కాదు, విలన్ పాత్రలు, అతిథి పాత్రలు, విభిన్నంగా ఉండే ఏ పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వాలని లేదు అని రాజశేఖర్ తెలిపారు.

ధృవ మూవీలో నేనే చేయాల్సింది
‘రామ్ చరణ్ నటించిన ‘ధృవ' సినిమాలో విలన్ వేషానికి మొదట నన్నే అడిగారని రాజశేఖర్ తెలిపారు. కానీ తర్వాత నిర్మాత ఎన్వీ ప్రసాద్ తమిళంలో నటించిన అరవింద్ స్వామినే పెట్టుకొంటున్నామని, ఆయన నటించిన సోలో షాట్లను తమిళం నుంచి అలాగే తీసుకుంటున్నామని, నన్ను పెట్టుకుంటే మళ్లీ ఆ సీన్లు రీషూట్ చేయాల్సి వస్తుందని చెప్పారని రాజశేఖర్ వెల్లడించారు.

బాలయ్య సినిమాలో కూడా
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోయే చిత్రంలో విలన్ వేషానికి నన్ను అడిగారు. బాలయ్యే ఈ పాత్రకు నన్ను సూచించారని రచయిత నాకు చెప్పాడు. కానీ అది రొటీన్ విలన్ పాత్ర అని తెలిసింది. బాలకృష్ణ గారు నాకు మంచి స్నేహితులు. కథ విన్నాక క్యారెక్టర్ బాగోలేదని చెప్పడం బాగుండదని చెప్పి ఆ కథ కూడా వినలేదని రాజశేఖర్ తెలిపారు.

చిరంజీవి వద్దన్నారు
చిరంజీవి గారు నటించిన ‘స్నేహం కోసం'లో విజయ్ కుమార్ చేసిన పాత్రను నేనే చేస్తానని అడిగాను. కానీ నేను చేస్తే చిన్నవాడిని అయిపోతానని చిరంజీవి గారు వద్దన్నారని రాజశేఖర్ తెలిపారు.

పాత్ర నచ్చితే ఎలాంటివైనా చేస్తాను
నాకు కథ నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేస్తాను, నచ్చక పోతే చేయను. ఆ మధ్య దర్శకుడు తేజగారు వచ్చి ఓ కథ చెప్పారు. అందులో విలన్ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి ఒప్పుకున్నాను. కానీ క్లైమాక్స్ విషయంలో తేజ గారికి.. నాకు ఏకాభిప్రాయం కుదరక పోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశామని రాజశేఖర్ తెలిపారు.


Click it and Unblock the Notifications