పూరీ మ్యాటర్లోనూ బండ్ల గణేష్కి ఐటీ శాఖ...
హైదరాబాద్: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబధించిన ఆర్థిక లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ లోతైన అధ్యయనమే చేస్తోంది. వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా ఐటీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. గణేష్ను హైదరాబాద్ బషీర్బాగ్లోగల తమ కార్యాలయానికి పిలిపించి ఇప్పటికే తమ వెంట తీసుకెళ్లిన పత్రాల ఆధారంగా వివరాలను రాబట్టారు.
ముఖ్యంగా ఇటీవల తీసిన 'గబ్బర్సింగ్' లాంటి చిత్రాలతోపాటు ఆయన ఒక ప్రముఖ దర్శకుడు(పూరీ జగన్నాధ్) కి అత్యంత ఖరీదైన జ్ఞాపికను బహుమతిగా ఇవ్వడంపైనా వారు దృష్టి సారించారు. వనరులు ఎక్కడివనే కోణంలో ఆరా తీస్తున్నారు. పూరి జగన్నాథ్కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 44 లక్షల రూపాయల విలువ చేసే లైటర్ను బహుమానంగా ఇచ్చారు. ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. 1455 వజ్రాలు పొదిగిన ఈ లైటర్ను చాలా అరుదైన బహుమానంగా చెప్పవచ్చు. ఇంత విలువైన బహుమతిని పూరికి ఇవ్వడానికి గల కారణమేమిటని అడిగితే - పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ చేసిన ఈ గిఫ్ట్ చాలా చిన్నదని తన అభిప్రాయమని, ఈ బహుమతితో పోలిస్తే పూరి జగన్నాథ్ విలువ చాలా ఎక్కువ అని బండ్ల గణేష్ అన్నారు. పూరి బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిందని, అయితే ఈ లైటర్ రెడీ కావడానికి ఇంతకాలం పట్టిందని, అందుకే ఇప్పుడు ఇచ్చానని ఆయన వివరించారు.
ఇక బండ్ల గణేష్ చూపించిన లెక్కలకు, పన్ను చెల్లింపునకు తేడాలు ఉన్నట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో- తాను అదనంగా కోటి రూపాయల మేర పన్ను కట్టనున్నట్టు గణేష్ పేర్కొన్నారని సమాచారం. దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా కొన్ని లెక్కలు తేలాల్సివుందని ఐటీ శాఖ వర్గాలు చెప్పాయి. ఐటీ అధికారులు సోమవారమిక్కడ జూబ్లీహిల్స్లోని గణేష్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడం విదితమే.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 41 లోని ప్లాట్ నంబర్ 761లోని గణేశ్ కార్యాలయంలో ఏడుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అస్పష్టమైన కొన్ని ఖాతాలపై అనుమానం రావడంతో గణేశ్ను పలుమార్లు ప్రశ్నించినట్టు సమాచారం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు గణేష్ కార్యాలయంలో ప్రక్రియ కొనసాగింది. అంతేకాకుండా సోమవారం దాడులకు కొనసాగింపుగా గణేష్ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులు మంగళవారం కూడా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయల వ్యవహారంతో సంబంధమున్న అకౌంట్లను అధికారులు పరిశీలించారు.
దాడుల్లో లభ్యమైన చాలా రశీదులకు పొంతన కుదరకపోవడంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో గణేష్ను బషీర్బాగ్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఐదు గంటలపాటు ఆయనను ప్రశ్నించిన తర్వాత లెక్కలపై ఇంకా అస్పష్టత ఉండటంతో మళ్లీ జూబ్లీహిల్స్ రోడ్డునెం.41లోని కార్యాలయానికి తీసుకొచ్చి మరోమారు ప్రశ్నించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్సింగ్ సినిమాకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సోమవారం ప్రారంభమైన దాడులు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సోదాలు జరిగాయి.


Click it and Unblock the Notifications











