‘ఎవడు’లో ఇక లేను, గెంటేసారు: సమంత సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం నుంచి సమంత తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ హీరోయిన్ సమంత ట్వీట్ చేసింది. అయితే ఆమె స్వయంగా తప్పుకోలేదట, ఓ వ్యక్తి ఆమెను కావాలనే సినిమా నుంచి బయటకు పంపాడట. 'ఎవడు సినిమా నుంచి నేను తప్పుకున్నట్లు వచ్చిన వార్త నిజమే, నేను ఆ సినిమాలో లేను, కానీ ఈ సారి డేట్స్ ప్రాబ్లం వల్ల మాత్రం కాదు... ఇది ఒక క్రియేటివ్ వ్యక్తి నిర్ణయం, నన్ను సినిమా నుంచి బయటకు పంపించిన అతనికి లక్కు కలిసి రావాలని విష్ చేయండి' అంటూ ట్వీట్ చేసింది.
అయితే.... ఆ క్రియేటివ్ పర్సన్ ఎవరు? ఎందుకు తనను ఆ సినిమా నుంచి బయటకు పంపించారు అనే విషయం మాత్రం సమంత వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయం బయట పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా సమంత ప్రస్తుతం 'ఎవడు' సినిమా నుంచి తప్పుకుందనే వార్త మాత్రం ఆమె ద్వారానే ఖరారు అయింది.
తొలిసారిగా మెగా కుటుంబానికి చెందిన హీరోతో నటించే అవకాశం దక్కించున్న సమంత... ఆ తర్వాత ఇతర మెగా హీరోల సరసన కూడా అవకాశం దక్కించుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్న తరుణంలో.... సమంత ఆ చిత్రం నుంచి బయటకు గెంటివేయబడటం మెగా అభిమానుల్లో చర్చనీయాంశం అయింది.
'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత స్థానంలో శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రంలో రెండో హీరోయిన్ గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











