Indira Devi Death: అమ్మ లేకుండా ఒక్క రోజు గడిపింది లేదు.. ఆమె ప్రేమ నాకు రక్షణ కవచం.. మంజుల ఎమోషనల్
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా చిత్రసీమలో అనేక మంది ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మరణం యావత్ తెలుగు ప్రజలను కలిచివేసింది. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరా దేవి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సెప్టెంబర్ 28 బుధవారం తుదిశ్వాస విడిచారు. మాతృవియోగంతో బాధపడుతున్న మహేశ్ బాబుకు అభిమానుల, స్నేహితులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే మహేశ్ బాబు సోదరి మంజుల ఆమె తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.

కృష్ణంరాజు మరణ వార్త..
చిత్రసీమలో వరుసగా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది. దీంతో ఘట్టమననేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందిరా దేవి మరణం సినీ ప్రముఖులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను కలిచివేసింది.

మీ ప్రేమ నా రక్షణకవచం..
సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా ఈ దంపతులకు మహేశ్ బాబు, రమేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి జన్మించారు. తన తల్లి గురించి చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మహేశ్ బాబు సోదరి మంజుల. ఈ పోస్ట్ లో ''మీరే నా మొదటి గురువు. నా పునాది, నా హృదయం. మీ ప్రేమ నా రక్షణకవచం. మీరే నా జీవితానికి స్ఫూర్తి. మా అమ్మకు తెలిసింది కేవలం ఇవ్వడం.. ఇవ్వడం.. ఇవ్వడం.. మాత్రమే. తన కోసం ఏమి అడగకుండా తన జీవితం మొత్తం అలానే చేశారు.

మంచి చమత్కారి..
మా చిన్నతనంలో తను లేకుండా ఒక్క రోజు కూడా గడిపింది లేదు. ఆమె నిస్వార్థంగా ప్రేమతో మా అవసరాలన్నింటిని చూసుకునేవారు. ఆమెకు పరిచయం ఉన్న ఎవరినైనా ప్రేమతో పలకరించేవారు. ఆమె మంచి చమత్కారి. ఆమె చాలా అందంగా నవ్వేవారు. ఆమె దగ్గర నేను ఎప్పుడూ భద్రతతో కంఫర్ట్ గా ఉండేదాన్ని. ఒక తల్లిదగ్గర తన బిడ్డ ఎంత సెక్యూర్ గా ఉంటుందో అలాగా.

నో చెప్పింది లేదు
ఆమె ఎప్పుడు నో చెప్పింది లేదు. నా జీవితం మొత్తంలో ఆమెతో ఒక్కసారి కూడా వాదనకు దిగింది లేదు. మీరు మా కోసం చేసిన ప్రతిదానికి మేము చాలా కృతజ్ఞులం అమ్మ. మేము మీకు థ్యాంక్యూ చెప్పడంతో అది సరిపోదు. మీ నిస్వార్థమైన ప్రేమ, త్యాగం మాటలకు అందనిది. మీలాంటి తల్లిని మేము కలిగినందకు మేము చాలా అదృష్టవంతులం. మీ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చలేం.

ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు
నాకు తెలుసు మీరు ఇప్పుడు మాకు దూరమైనప్పటికీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. మీ తదుపరి ప్రయాణం ప్రశాంతంగా సాగాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం'' అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు మంజుల. ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఆత్మకి శాంతి చేకూరాలని..
''శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను'' అని ట్విటర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











