ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ దారెటు..? చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య మంతనాల రిసల్ట్ ఏంటి..?
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాదు.. ఎన్నికలు ముగిశాక కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరేసిన వైసీపీ నేతలు వీలుచిక్కినప్పుడల్లా టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకు పడుతున్నారు. గత ప్రభుత్వం టీడీపీ పనితీరును ఎండగడుతూ ఇప్పటికే కుంగిపోయిన టీడీపీ పార్టీ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్తో కాసేపు ముచ్చటించడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. వీరిద్దరి సమావేశంపై ఒక్కొక్కరి వర్షన్ ఒక్కోలా ఉండటంతో ప్రస్తుతం ఈ ఉదంతం హాట్ టాపిక్గా మారింది.

అన్నీ తాత పోలికలే.. అచ్చం ఆయన లాగే
నందమూరి వారసుల్లో గొప్ప కీర్తి గడించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత తారక రామారావు పోలికలతో ఉండటమే గాక.. అచ్చం ఆయన లాంటి లక్షణాలే ఎన్టీఆర్లో కనిపించడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాల్లో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తాత లాగే రాజకీయాల్లో కూడా రాణించే చాతుర్యం గలవాడని పలు విశ్లేషణలు సాగుతూ వస్తున్నాయి.

మరోవైపు టీడీపీ గురించి.. బలమైన వాదనలు
అయితే.. గతంలో టీడీపీ పార్టీ పట్ల ఇంట్రెస్ట్ చూపి ప్రచారం కూడా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రమంగా దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీకి ఎన్టీఆర్ దూరమవడంపై భిన్న వాదనలు వినిపించాయి.. కానీ దేనికీ ఆయన స్పందించలేదు. ఇక ఇటీవలే జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చూసి టీడీపీని కాపాడే సత్తా ఎన్టీఆర్కి మాత్రమే ఉందనే వాదనలు తెరపైకి వచ్చాయి.

సరిగ్గా ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్తో చంద్రబాబు
సరిగ్గా ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్తో చంద్రబాబు కాసేపు ముచ్చటించడంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు ముదిరాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ సంవత్సరీకానికి విచ్చేశారు చంద్రబాబు. ఆదివారం హైదరాబాద్లో నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఏకాంతంగా జూనియర్ ఎన్టీఆర్తో మంతనాలు
నందమూరి హరికృష్ణ పటానికి పూల మాల వేసిన చంద్రబాబు నాయుడు..
ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ కాసేపు మాటాడుకోవటం కనిపించింది. ఓ పక్కగా తీసుకెళ్లి.. కొద్దిసేపు ఏకాంతంగా జూనియర్ ఎన్టీఆర్తో మంతనాలు సాగించారు చంద్రబాబు. కొద్దిసేపటి తరువాత కళ్యాణ్ రామ్ కూడా వారితో కలిశారు.

ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ దారెటు..?
దీంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మరోసారి ఆసక్తికర చర్చలు రాజుకున్నాయి. గతంలో ఎన్టీఆర్ వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు రావడం, తాజాగా ఇలా చంద్రబాబు, ఎన్టీఆర్ తో ముచ్చటించడం సినీ, రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చలకు తెరలేపింది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ దారెటు..? రాజకీయాల్లోకి వస్తారా? వస్తే వైసీపీ అంటారా లేదా టీడీపీ అంటారా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి జనాల్లో.

సినిమాల్లో బిజీ బిజీ.. రాజకీయాల వైపు చూసేనా?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన RRR సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మరో మూడేళ్ళ పాటు ఆయన తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల వైపు చూసే ఛాన్సే లేదని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి తాజాగా వస్తున్న ఈ వార్తలపై ఎన్టీఆర్ స్పందిస్తాడా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications











