సినీ నటి, మంత్రి రోజాకు చేదు అనుభవం.. ఎయిర్పోర్టులో చెప్పులు, చీపుర్లతో దాడి!
విశాఖపట్నంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద రసాభసాగా మారింది. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్టుకు చేరుకొన్న పవన్ కల్యాణ్కు జనసేన శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. అదే సమయంలో ఏపీలో అధికార పార్టీ మంత్రులు అక్కడికి చేరకొన్న సమయంలో భారీగా గలాటా చోటు చేసుకొన్నది. ఈ సందర్భంగా కొందరు మంత్రి రోజా కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్పై రోజా విమర్శలు
ఏపీ రాజకీయాలు ఇటీవల ఘర్షణ వాతావారణాన్ని తలపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ను ఇటీవల కాలంలో మంత్రి రోజా మాటల బాణాలు సంధిస్తూ విమర్శలు చేస్తున్నారు. వైజాగ్లో మూడు రాజధానుల అంశంపై గర్జన సభ సందర్భంగా పవన్ కల్యాణ్పై రోజా తీవ్ర ఆరోపణలు చేయడం మీడియాలో వివాదంగా మారాయి. పవన్ కల్యాణ్పై అవాకులు, చెవాకులు పేలుతున్న రోజాకు బుద్ధి చెబుతామని జనసైనికులు హెచ్చరించారు.

పెళ్లికి వైజాగ్ అమ్మాయి కావాలి..
అయితే గర్జన సభకు ముందు.. పవన్ కల్యాణ్ను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి. పరిపాలన వికేంద్రికరణ కోసం మూడు రాజధానులు పెడుతామంటే.. పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నాడు అంటూ రోజు విరుచుకుపడింది. ఇలా ఇటీవల కాలంలో ప్రత్యేకంగా పవర్స్టార్ను రోజా టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.

ఎయిర్పోర్టులో రోజా కారుపై దాడి
వైజాగ్లో గర్జన సభ ముగించుకొని తిరుగు ప్రయాణమైన రోజా ఎయిర్పోర్టుకు చేరుకొన్నారు. అదే సమయంలో రోజా కారు అని గుర్తించిన కొందరు ఆమె కారుపై చేతులతో బాదుతూ దాడికి ప్రయత్నించారు. రోజా కారుపై కర్రలు, చెప్పులు, చీపుర్లతో కొందరు మహిళలు దాడి చేశారు. కార్లపై పిడిగుద్దులు గుద్దుతూ హంగామా చేశారు. దాంతో ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకొన్నది.

సురక్షితంగా రోజా బయటపడి..
అయితే తనపై చెప్పులు, చీపుర్లతో జరిగిన దాడి సంఘటనపై మంత్రి రోజా స్పందించలేదు. ఈ దాడి నుంచి తప్పించుకొని రోజా సురక్షితంగా ఎయిర్పోర్టులోకి వెళ్లిపోయారు. అయితే రోజాకు ఏమైనా గాయాలు అయ్యాయా? అనే విషయంపై క్లారిటీ లభించలేదు. ఈ ఘటనపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

దాడిపై నాదెండ్ల స్పందన
ఇక రోజాపై దాడి ఘటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తున్న ప్రజాదరణను దృష్టి మళ్లించడానికి కొందరు అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. రోజాపై జనసేన శ్రేణులు దాడి చేశారని పోలీసులు నిర్దారించాలేదు. గతంలో విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తి ఘటనతో హడావిడి చేశారు. కోడికత్తి కేసు ఏమైందో ఇప్పటికీ ప్రభుత్వం దర్యాప్తు చేయించలేదు. రోజా, ఇతరులపై జరిగిన కోడికత్తి లాంటిదే అని మనోహర్ అన్నారు.


Click it and Unblock the Notifications











