పిఠాపురంలో జబర్దస్త్ టీమ్ ప్రచారానికి 2 కోట్లు..బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి..వైసీపీకి గెటప్ శ్రీను సవాల్
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో పాపులర్ అయిన గెటప్ శ్రీను హీరోగా నటించిన ''రాజు యాదవ్ '' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. అంకితా ఖరత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మే 17న రాజు యాదవ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గెటప్ శ్రీనును ఏపీ రాజకీయాలు, ఎన్నికల ప్రచారంపై విలేకరులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో జనసేన తరపున ప్రచారం చేయాల్సిందిగా నాగబాబు ఆహ్వానించారా, లేక స్వచ్ఛందంగానే వెళ్లారా అని ప్రశ్నించారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవి. పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన ఆయన అధికారాన్ని అందుకోలేదు. పవన్ను సీఎంగా చూడాలన్నది కోట్లాది మంది అభిమానుల కల. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో పవన్ సైతం నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ కృంగిపోకుండా కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేశారు, ఒక్కడే బరిలో దిగితే జరిగే నష్టాన్ని ఊహించి ఈసారి అలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కేడర్తో పాటు మెగా కుటుంబం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ కోసం జబర్దస్త్ బ్యాచ్ గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ తదితరులు కూడా తిరుగుతున్నారు. రాజకీయాల్లోకి దిగితే చెప్పుదెబ్బలు, రాళ్ల దెబ్బలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇందుకు ఈ జబర్దస్త్ నటులు కూడా మినహాయింపు కాదు. వైసీపీ నుంచి వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెయిడ్ బ్యాచ్ అని, ఎపిసోడ్లు, కాల్షీట్లు లెక్కన లక్షల్లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను గెటప్ శ్రీను తిప్పికొట్టారు.
పిఠాపురంలో జబర్దస్త్ కామెడీ షోలోని సభ్యులు ప్రచారం చేయడంపై వైసీపీ నేతలు ఆరోపణలు గెటప్ శ్రీను తోసిపుచ్చారు. రోజు వారీ కాల్షీట్ల ప్రకారం ప్రచారం చేశారు. మా కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మా ప్రచారం కోసం డబ్బులు ఇచ్చారు అనే విమర్శల్లో పసలేదు. కావాలంటే మా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.

దీనికి గెటప్ శ్రీను బదులిస్తూ.. తమను ఎవరు పిలవలేదని, స్వచ్ఛందంగానే ప్రచారం చేస్తున్నామని .. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంతోనే ఇంత కష్టపడుతున్నామన్నారు. మేం ప్రచారానికి వస్తామని అడిగితే.. వారే ఒక డేట్ ఇచ్చి రమ్మన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక జనసేన నుంచి డబ్బులు అందాయన్న విమర్శలకు కూడా తనదైన శైలిలో కౌంటరిచ్చారు శ్రీను. ఇంటికి వచ్చి సోదాలు చేసుకోవచ్చని.. కావాలంటే మా అకౌంట్ నెంబర్లు కూడా ఇస్తామని , అసలు డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని, ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని గెటప్ శ్రీను తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు.
మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో అవకాశాలు రావన్న మంత్రి రోజా వ్యాఖ్యలపైనా గెటప్ శ్రీను స్పందించారు. రోజా మావి చిన్న ప్రాణాలు అన్నారని, అవి చిన్న కామెంట్స్లానే తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను మెగా ఫ్యామిలీతోనే కాదు.. ఎన్టీఆర్, వెంకటేష్, నాని లాంటి స్టార్స్తోనూ సినిమాలు చేశానని శ్రీను క్లారిటీ ఇచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రి రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications










