MAA Elections.. వివాదంలోకి లాగకండి.. నా ఓటు అతడికే.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయాల్లో ప్రత్యక్ష ఎలక్షన్లను తలపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా, వివాదాస్పదంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్స్ తమ గెలుపుకు కృషి చేస్తున్నాయి. తమ ఎన్నికల మానిఫెస్టోలను విడుదల చేసి నటీనటులు సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెబుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో పోటాపోటిగా మీటింగులు పెట్టి ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నారు. అయితే ఈ విమర్శలు రెండు ప్యానెల్స్ మధ్య వివాదాలను సృష్టిస్తున్నాయి.

కృష్ణుడు, అర్జునుడిని అంటూ
మా ఎన్నికల్లో మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తూ కృష్ణుడు, అర్జునుడిని అంటూ తనకు తాను వర్ణించుకొంటున్న వీకే నరేష్ వివాదానికి అత్యంత కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలు మీడియాలోనే కాకుండా సినీ పరిశ్రమలో దుమారం లేపుతున్నాయి. ప్రకాశ్ రాజ్ను టార్గెట్ చేస్తూ తెలుగు వాడు కాదు.. నాన్ లోకల్ అంటూ కామెంట్స్ చేయడంపై విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఎజెండా చెప్పి.. గెలవాలి కానీ.. సినీ పరిశ్రమలో ప్రాంతీయ విభేదాలు సృష్టించడం సరికాదు అని కొందరు హితవు పలుకుతున్నారు.

ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేకి అంటూ
ఇక గత రెండు రోజుల్లో మా ఎన్నికల ప్రచారం మరింత దిగజారినట్టు కనిపించింది. ప్రకాశ్ రాజ్ దేశభక్తుడు కాదు, ఆయన హిందువు కాదు. హిందు మతానికి వ్యతిరేకి. జాతి వ్యతిరేకి అంటూ వీకే నరేష్ మద్దతుదారులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం మరింత వివాదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక అంశాలు మా ఎన్నికల్లో రచ్చ చేస్తున్నాయి.

ఓటింగ్లో పాల్గొంటాను అంటూ రోజా
ఇలాంటి నాన్ లోకల్.. లోకల్, జాతి వ్యతిరేకి అనే ప్రచారంపై సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజా తాజాగా మా ఎన్నికలపై ఘాటుగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శాశ్వత సభ్యురాలిగా మా ఎన్నికల్లో పాల్గొంటాను. మా సంస్థను అభివృద్ధి చేస్తామని రెండు ప్యానెల్స్ మ్యానిఫెస్టో రిలీజ్ చేశారనే అనే విషయాన్ని రోజా గుర్తు చేశారు.

లోకల్కా? నాన్ లోకల్కు ఓటు వేస్తారా?
అయితే లోకల్, నాన్ లోకల్ అనే విధంగా తెలుగు సినిమా విడిపోయింది. లోకల్కు ఓటు వేస్తారా? నాన్ లోకల్కు ఓటు వేస్తారా అనే ప్రశ్నకు రోజా సమాధానం ఇస్తూ.. ఇలాంటి వివాదాస్పదమైన ప్రశ్నలను అడగకండి. ఈ రోజు మా ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల కంటే వాడివేడిగా జరుగుతున్నాయి. ఆ వివాదాల్లో నేను వేలు పెట్టను. కానీ ఆర్టిస్టుగా నా ఓటును సద్వినియోగం చేసుకొంటాను అని రోజా అన్నారు.

అక్టోబర్ 10న రసవత్తరంగా ఎన్నికలు
వివాదాలు, సంచలన ఆరోపణల మధ్య మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన దాదాపు 600 మంది ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల ప్రచారం వివాదాస్పదంగా మారడంతో అందరి దృష్టి ఈ ఎన్నికపై పడింది. ఈసారి ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకొన్నట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











