అర్జున్ 'జైహింద్-2' మొదలైంది
అర్జున్ మాట్లాడుతూ...''విద్యావ్యవస్థ చుట్టూ సాగే కథాంశంతో సినిమా రూపొందిస్తున్నాను. ఇందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ రాసిన ఓ వ్యాసమే స్ఫూర్తి'' అన్నారు . ఆయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జైహింద్-2'. 'నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్' అనేది ఉపశీర్షిక. సుర్వీన్ చావ్లా, చార్లెట్ క్లేయర్ హీరోయిన్స్.
అలాగే ''వృత్తిని ఓ బస్సు ప్రయాణంలా భావిస్తాను. సీటులో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు బస్సు ఆగిపోయినట్టుగా, రోడ్డు దాటి పక్కకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అలా అనిపించినప్పుడు వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చుంటుంటాను. అలా కూర్చోవడం ఇది పదోసారి. 1993లో 'జైహింద్' సినిమా చేశాను. ఇరవయ్యేళ్ల తరవాత ఆ చిత్రానికి కొనసాగింపుగా 'జైహింద్ 2'ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని అబ్దుల్ కలామ్కీ, దేశంలోని పాత్రికేయులకీ అంకితమిస్తాను. మన దేశంలో 74శాతం మంది చిన్నారులు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. వారి జీవితాల్ని ప్రతిబింబించేలా ఈ కథ సాగుతుంది''అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ ''నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు నా మిత్రుడు అర్జున్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా అన్ని చోట్లా ఆదరణ పొందాలి''అని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘుబాబు, షఫి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: వేణుగోపాల్, సంగీతం: హరికృష్ణ.


Click it and Unblock the Notifications












