మేడం టుస్సాడ్స్లో శ్రీదేవి విగ్రహం.. తల్లిని చూస్తూ జాన్వీకపూర్ భావోద్వేగం
ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా తన అందచందాలతో అలరించి భారీ పాపులారిటీ తెచ్చుకుంది దివంగత నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ హోటల్ బాత్టబ్లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను గుర్తు చేసేలా మరణం తర్వాత ఆమెకు అరుదైన గౌరవం దక్కింది.

మేడం టుస్సాడ్స్లో శ్రీదేవి మైనపు బొమ్మ
వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్ని రూపొందించారు. దీనిని సింగపూర్లోని మ్యూజియంలో ఈ రోజు (సెప్టెంబర్ 4) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోణీ కపూర్, కూతురు జాన్వీకపూర్ హాజరయ్యారు.

అచ్చం శ్రీదేవి లాగే.. తల్లిని చూస్తూ జాన్వీకపూర్
సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించబడిన ఈ విగ్రహాన్ని చూస్తూనే శ్రీదేవి దిగొచ్చిందా? ఏంటి.. అన్నట్లుగా ఉంది. దీంతో అచ్చం తన తల్లి శ్రీదేవి లాగే ఉన్న ఆ మైనపు బొమ్మను చూస్తూ ఆమె కూతురు జాన్వీకపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లిని తలచుకుంటూ తనలో తాను కుమిలిపోతూ విలపించింది.

బంగారు వర్ణం.. అబ్బురపరిచే రూపు
శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమాలోని ''హవా హవాయి'' సాంగ్లో వేసుకన్న బంగారు వర్ణపు దుస్తుల రూపంతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఇప్పటికే పలువురు సినీ తారల విగ్రహాలను తమ మ్యూజియంలో ఉంచిన మేడం టుస్సాడ్స్.. తాజాగా చనిపోయిన తర్వాత శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

బాలీవుడ్ టు టాలీవుడ్
గతంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే టాలీవుడ్ నుంచి మహేష్, ప్రభాస్ మైనపు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేషనల్ స్టార్ శ్రీదేవికి ఆ మ్యూజియంలో స్థానం కల్పించారు.

శ్రీదేవి సినీ ప్రస్థానం
చిన్నతనంలోనే బాల నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు. దక్షిణాదిన ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ స్టేటస్ పొందింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడే నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన శ్రీదేవి పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. తర్వాత కొన్నాళ్లకు ‘ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన మూవీ ‘మామ్'.


Click it and Unblock the Notifications











