జియాఖాన్ కేసు మరో మలుపు..
బాలీవుడ్ తార జియాఖాన్ మరణానికి సంబంధించిన కేసులో ఆమె తల్లి, బ్రిటన్ సిటిజన్ రబియా ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
బాలీవుడ్ తార జియాఖాన్ మరణానికి సంబంధించిన కేసులో ఆమె తల్లి, బ్రిటన్ సిటిజన్ రబియా ఖాన్కు చుక్కెదురైంది. జియాఖాన్ మరణంపై దర్యాప్తు చేపట్టడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను నియమించాలని దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సిట్ను ఏర్పాటు చేయాలని రబియాఖాన్ 2013 జూన్ 3 తేదీన పిటిషన్ దాఖలు చేశారు.

ఉరి వేసుకొని జియాఖాన్ ఆత్మహత్య
జియాఖాన్ ముంబైలోని విలాసవంతమైన ప్రాంతం జుహు ఏరియాలోని సాగర్ సంగీత్ అపార్ట్మెంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని రబియాఖాన్ ఆరోపించింది. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

సూరజ్ పంచోలి కారణమని ఆరోపణలు
జియాఖాన్ ఆత్మహత్య అనంతరం ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలిపై ఆరోపణలు వచ్చాయి. జియా మరణానికి కారణం సూరజ్ అని సూసైడ్ నోట్లో వెల్లడైంది. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత బెయిల్ విడుదలయ్యారు. సూరజ్ ప్రముఖ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు.

దర్యాప్తులో జోక్యం చేసుకోవడం తగదు.. కోర్టు
జియా తల్లి రబియా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ శాలిని ఫాన్సల్కర్ జోషి కూడిన బెంచ్ విచారించింది. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతున్నదని, సిట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆ దర్యాప్తులో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొన్నది.

సూరజ్ పంచోలి పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు
జియా మరణానికి సంబంధించిన వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ట్రయల్ కోర్టు నేరారోపణలు చేస్తున్నదని సూరజ్ ఆరోపించారు. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సూరజ్ ఇటీవల దాఖలు చేసిన ఇంటర్వెన్షన్ పిటిషన్ కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా జియా మృతదేహానికి సంబంధించిన ఫొటోలు, శవ పరీక్ష నివేదిక, బ్రిటన్ నిపుణులు అందించిన రిపోర్టును జియాఖాన్ న్యాయవాది కోర్టుకు అందజేశారు.


Click it and Unblock the Notifications











