పవన్ కళ్యాణ్ ని పార్టీలోకి రమ్మంటూ పిలుపు
హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ విన్నా పవన్కళ్యాణ్ ఏదన్నా పార్టీలో చేరబోతున్నారా లేక ఏ పార్టికైనా మద్దతు ఇవ్వబోతున్నారా అనే చర్చలే. రెండో వారంలో ఆయన స్పష్టంగా ప్రకటన చేస్తానని చెప్పటంతో మీడియాలో రకరకాల ప్రచారాలు తారా స్ధాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో .. లోక్సత్తా పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే సముచిత గౌరవాన్ని కల్పించి ప్రచార, నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. జేపీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలియచేసారు.

జె.పి మాట్లాడుతూ.... ''నేటి సమాజంలో చాలామంది రాజకీయాన్ని వ్యాపారంగా, అధికారమార్గంగా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజకీయాన్ని పవిత్రమైన పనిగా, సమాజాన్ని మార్చే సాధనంగా, కోట్లాదిమంది బతుకుల్ని మార్చే అవకాశంగా భావించేవారు అవసరం. సమాజం బాగుండాలని తపనపడే మంచి మనసున్న వ్యక్తి పవన్కళ్యాణ్. ఆయనకు లక్షలమంది అభిమానులున్నారు. అలాంటివ్యక్తి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి, నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఆయన్ను మనసారా ఆహ్వానిస్తున్నాం. లోక్సత్తాను వేదికగా చేసుకోండి'' అంటూ పవన్కళ్యాణ్ను జేపీ ఆహ్వానించారు.
అలాగే ప్రస్తుత రాజకీయాలను మార్చేందుకు లోక్సత్తా పోరాడుతోందని, పవన్కళ్యాణ్ వంటి ప్రముఖులు ప్రజాజీవితంలోకి వచ్చి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షోభంలో ఉన్న తెలుగుజాతికి మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదం చేయాలన్నారు.


Click it and Unblock the Notifications











