తప్పు జరిగి ఉంటే క్షమించండి : ఎన్టీఆర్
హైదరాబాద్ : ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎంత ఆనందంగా ఉన్నానో అంతే బాధతో ఉన్నాను. చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకొంది. ఓ అభిమాని ఇక్కడకు వచ్చి మృత్యువాతపడటం దురదృష్టకరం. ఆ మరణం తట్టుకోలేనిది. ఆ తల్లి కడుపు కోత తీర్చలేనేమోగానీ ఆ ఇంటి బిడ్డను ఆదుకొంటాను. ఈ అపశ్రుతి జరగడానికి నా తరఫున ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి అని ఎన్టీఆర్ అన్నారు. . ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బాద్షా' ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం నానక్రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరిగింది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు. ఈ వేడుకలో జరిగిన తొక్కిసలాటలో వరంగల్ జిల్లానుంచి వచ్చిన ఓ అభిమాని మరణించాడు.
అలాగే... "మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకును. నాకు తోబుట్టువులు ఎవరూ లేరని బాధపడేవాడిని. కానీ అభిమానులందరూ నాకు తోబుట్టువులుగా మారారు. మీ అందరి పిడికిలి మధ్య గుండెను నేను. నా పిడికిలిలో ఉన్న గుండెకాయ మీరు. ఇవాళ 'బాద్షా' ఆడియో వేడుకకు వచ్చి తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు జరగకూడదు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ క్షేమంగా ఇంటికెళ్లాలి. మీకోసం ఇంట్లో వారందరూ ఎదురుచూస్తుంటారు. మృతి చెందిన అభిమాని తల్లి కడుపుకోతని నేను తీర్చలేకపోవచ్చు. కానీ వారి బిడ్డగా నేను బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి'' అని ఎన్టీఆర్ అన్నారు.
ఈ ఘటనపై నిర్మాత బండ్ల గణేశ్ కూడా స్పందించారు. "ఆనందోత్సవ సమయంలో అపశ్రుతి జరిగింది. ఈ దుర్ఘటన నన్ను కలచివేస్తోంది. చనిపోయిన బిడ్డ తల్లి నన్ను పెద్ద మనసుతో క్షమించాలి. వెంటనే వారి ఇంటికి వెళతాను. వారి అవసరాలను తీరుస్తాను'' అని పేర్కొన్నారు. "ఇలా జరగడం బాధాకరం. మృతుడి కుటుంబానికి మా నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షలను అందజేస్తారు'' అని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు.


Click it and Unblock the Notifications











