కోర్టుకు హాజరైన జూ ఎన్టీఆర్-కేసు కొట్టివేత
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సూర్య పేట కోర్టులో శనివారం హాజరయ్యారు. 2009 ఎన్నికల సమయంలో జూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రచారం ముగించుకుని తన స్నేహితులు రాజీవ్ కనకాల తదితరులతో వాహనంలో హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోతె సమీపంలో యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలపాలైన జూనియర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తాగి డ్రవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిందనే అనుమానాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా డ్రైవర్ చేశాడనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా జూనియర్ సేఫ్ గా కోలుకోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అప్పట్లో...
పోలీసులు ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. జూనియర్ కారు డ్రైవర్ పై 338 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జూనియర్ తొలిసారిగా ఈరోజు ఆ కేసు విచారణకు సూర్యపేట కోర్టుకు హాజరయ్యారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం కావడంతో కోర్టు కేసును కొట్టి వేసింది. అనంతరం జూనియర్ హైదరాబాద్ తిరిగి వెళ్లి పోయారు. కేసు కొట్టివేయడంతో కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో సంతోషం నెలకొంది. జూనియర్ రాక సందర్భంగా అభిమానులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.
కేసు నుంచి ఉపశమనం లభించడంతో ఇకపై హ్యాపీగా జూనియర్ ఎన్టీఆర్ షూటింగుల్లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం జూనియర్ బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











