జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం.. అభిమాన హీరోను ఫాలో అయిన విశ్వక్ సేన్
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దండికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. దీంతో ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో వర్షాలు అపార ప్రాణ, ఆస్తి, పంట నష్టాలను మిగిల్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలుస్తూ సహాయక చర్యలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ రంగంలోకి ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్కు రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదల వల్ల భారీ నష్టం జరిగిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచాడు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి భారీ విరాళం అందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 'రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచి వేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ అదే పోస్టులో 'వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను' అని తెలిపాడు. అంటే మొత్తంగా అతడు కోటి రూపాయలు డొనేషన్ చేసి ఈ పాన్ ఇండియా హీరో గొప్ప మనసును చాటుకున్నాడు.
టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన వెంటనే అతడిని ఎంతగానో అభిమానించే విశ్వక్ సేన్ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. ఈ మేరకు X (ట్విట్టర్) ఖాతాలో 'ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించేందుకు ఈ సాయం చిన్న అడుగు మాత్రమే' అని చెప్పుకొచ్చాడు. ఈ హీరోలు చేసిన సాయంపై చాలా మంది ప్రశంసలు కురిస్తున్నారు.


Click it and Unblock the Notifications











