రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరిని పొగొట్టుకొన్నా.. ఫ్యామిలీ కోసం జాగ్రత్తగా ఉండండి.. ఎన్టీఆర్ భావోద్వేగం
టాలీవుడ్లో స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో తనకు దూరమైన సోదరుడు జానకీరాం నందమూరి, తండ్రి నందమూరి హరికృష్ణను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..
Recommended Video

సినీ నటుడిగా కాదు.. సాధారణ పౌరుడిగా
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక కాన్ఫరెన్స్ ముగింపు సమావేశానికి ఆహ్వానించిన పోలీస్ డిపార్ట్మెంట్కు, సందీప్ గారికి, వీసీ సజ్జనార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సుకు సినీ నటుడిగా రాలేదు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకొన్న సాధారణ పౌరుడిగా వచ్చాను అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

నా సోదరుడి మరణంతో
జీవితంలో ఎంతో జాగ్రత్తపరుడైన నా సోదరుడు నందమూరి జానకీరాం రోడ్డు ప్రమాదంలో కీర్తిశేషులు అయ్యారు. మేము వాహనాలను నిర్లక్ష్యంతో నడిపేవాళ్లం. కానీ జానకీరాం వాహనంను క్రమశిక్షణతో నడిపేవారు. నేషనల్ హైవేలో ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అలాంటి వ్యక్తి మరణించారు. అది మా జీవితంలో ఎంతో బాధకరమైన సంఘటనగా మారింది అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

రోడ్డు ప్రమాదంలో నాన్న హరికృష్ణ
మా జీవితాలను రెండో ప్రమాదం వెంటాడింది. మా నాన్న గారు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినప్పుడు మా నాన్న గారు దాదాపు 33 వేల కిలోమీటర్లు చైతన్యరథాన్ని సురక్షితంగా నడిపారు. మా తాత గారికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అని తన బాధను ఎన్టీఆర్ వెల్లడించారు.

మీ కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుచూపులు
ఎవరైనా మీ వాహనంపై ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకొండి. మీ రాక కోసం భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, మీ మీద ఆధార పడిన ఎంతో మంది ఎదురు చూస్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించలేం. మనంతట మనమే జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











