తెలంగాణలోనే పుట్టా..పెరిగా: జూ ఎన్టీఆర్
"నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఈ మట్టిలోనే కలిసిపోతా" అని జూ.ఎన్టీఆర్ అన్నారు. ఆయన తాజా చిత్రం అదుర్స్ రిలీజ్ ను తెలంగాణ ఏరియాల్లో అడ్డుకుంటామని హెచ్చరించటంతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన "మా తాత, బాబాయిలతో పాటు నన్ను అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించబట్టే విజయాలు సాధించాం. మీ ప్రేమాభిమానాలు గతంలోలాగే అందించండి. నేను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగా. ఇక్కడే మరణిస్తా. హైదరాబాద్లోనే సినిమాలు తీసుకుంటున్నా, దర్శకనిర్మాతలెవరైనా ఇక్కడికి వచ్చి కథలు చెప్పాల్సిందే. నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు" అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రం విడిపోవాలన్నా, కలిసుండాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తీసుకోవలసిన నిర్ణయం. నాయకులే చూసుకుంటారు. ఒక హీరో, దర్శకుడు, కళాకారులు తీసుకునే నిర్ణయం కాదు" అని అభిప్రాయపడ్డారు. అందరి ఆదరణతోనే తమ కుటుంబం ఈ స్థాయికి చేరిందన్నారు. ఓ నటుడిగా ప్రేక్షకులను అలరించడం, మూడు గంటలపాటు వినోదం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానాలు ఎప్పటిలానే చూపిస్తారని ఆశించారు.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైకి తరలి వెళ్లనుందన్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ చెప్పారు. "ఎవరు చెప్పారండీ పరిశ్రమ చెన్నైకి వెళ్లిపోతుందని? ఇక్కడే చాలా బాగుంది. అంతా ఇక్కడే చక్కగా సెటిల్ అయ్యాం. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. నేనైతే ఇక్కడే ఉంటాను'' అని స్పష్టం చేశారు. ఇవన్నీ కొందరు కల్పిస్తున్న అపోహలంటూ... దీని ప్రభావం మొత్తం సినీ పరిశ్రమపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











