JR NTR SAYS SORRY తలవంచి క్షమించమని అడుగుతున్నా.. అభిమానులకు జూ.ఎన్టీఆర్ సోరీ.. ఆ ఛాలెంజ్ స్వీకరించాలంటూ..
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. అనివార్య కారణాల వల్ల రద్దు అయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో అత్యంత ఘనంగా జరగాల్సిన ఈ ఈవెంట్ను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి.. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్నారు. చివరికి నిరాశతో వెనుదిరిగారు. అయితే ఈ సినిమాకు దక్షిణాదిలో సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి.. చిత్రబృందంతో పాటు పార్క్ హయత్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి గల కారణాలను తెలిపారు.
"రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశాం. అందుకోసం ఎంతో కష్టపడ్డాం. కరణ్ జోహార్ వినాయకుడి పూజా సరిగ్గా చేయకపోవడం వల్లే క్యాన్సిల్ అయ్యింటుంది. ఐదు రోజుల కింద కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటూ పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చింది. వారు సూచించిన మార్పులు చేశాం. ఈరోజు ఎక్స్ట్రా గణేశ్ నిమజ్జనాలు ఉండటం వల్ల పోలీసుల బందోబస్తు కుదరలేదు. మాపై వినాయకుడి కృప లేదనుకుంటా. ఈవెంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. బ్రహ్మాస్త్రలో రణ్బీర్ మంటను విసరగలడు.. అది లైవ్లో ఏర్పాటు చేశాం.. అతడు మాట్లాడాకా చివర్లో నీ శక్తి చూపించు అని ఎన్టీఆర్ అడుగడానికి.. తొడగొట్టు చిన్నా అంటాడు. అప్పుడు కూడా అదిరిపోయే ఫైర్ వర్క్ ఏర్పాటు చేశాం. అది అభిమానుల మధ్య చూడటానికే వచ్చాను" అని అన్నారు.

తారక్ మాట్లాడుతూ తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. "ఈవెంట్కు వచ్చిన, రాలేకపోయిన నా అభిమానులను తలవంచి క్షమించమని అడుగుతున్నా. అయితే మీరు ఎక్కడున్నా.. మంచి సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. నాకు అమితాబ్ బచ్చన్ చాలా ఇష్టం. ఆయన ఇంటెన్సిటీ, కళ్లు, మాట తీరు, నటన, ప్రతి ఒక్కటీ నన్ను ప్రభావితం చేశారు. ఆ తర్వాత నాపై ప్రభావం చూపిన వ్యక్తి రణ్బీర్. రణ్బీర్లో ఉన్న ఇంటెన్సిటీ.. నాకు స్ఫూర్తి. ఆయన రాక్స్టార్ చిత్రం నాకు చాలా ఇష్టం. అతడితో ఒకే స్టేజ్పై ఉండటం.. బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. అతడు దీనికి మించిన సినిమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండిస్ట్రీ వదిలిన బ్రహ్మాస్త్రంగా మారాలని ఆకాంక్షిస్తున్నా. రాజమౌళి, కరణ్ జోహార్.. అన్ని ఇండ్రస్ట్రీలను ఏకం చేసి.. ఇండియన్ సినిమాగా మలిచారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంపై ఒత్తిడి ఉంది. ప్రేక్షకుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ఈ సవాలును మనందరం స్వీకరించాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడే బాగా పనిచేస్తాం. కాబట్టి ప్రేక్షకుల కోసం గొప్ప కంటెంట్ అందించేందుకు ప్రయత్నిద్దాం.బ్రహ్మాస్త్ర .. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రహ్మాస్త్రం లాగా ఉండాలి."
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న హిందీ సహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











