ఆచార్య ఈవెంట్కు ఎన్టీఆర్.. కొరటాల స్కెచ్తో వేదికపై RRR జోడి
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆచార్య సినిమాతో ఆయన 29వ తేదీన థియేటర్లోకి రానున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో విజయవాడలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ ఎట్టకేలకు హైదరాబాద్లో ఈవెంట్ ఫిక్సయింది. 23వ తేదీ సాయంత్రం జరుగుతున్న ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులు ఎవరు అనే విషయం ఇప్పటివరకు క్లారిటీ లేదు. తాజాగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు ఈ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే

అంచనాలు రెట్టింపు
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ఆచార్య. గతంలో కూడా వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు కానీ పూర్తిస్థాయిలో నటిస్తున్న సినిమా ఇది. ప్రేక్షకుల నాడి సులభంగా పట్టగల కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్నారు అనగానే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి, దానికి తగ్గట్టే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి.

ఏప్రిల్ 23 వ తేదీన
మెగా స్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మెగా అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ లో ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగానే ఏప్రిల్ 23 వ తేదీన హైదరాబాద్ యూసఫ్ గూడ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ముఖ్య అతిధులు
శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తొలుత రామ్ చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు కానీ చివర్లో తప్పుకున్నారు. ఆయన RRR సినిమాలో నటించాల్సి రావడంతో రెండింటినీ మేనేజ్ చేయలేక ఆయన పూర్తి బాధ్యతలు నిరంజన్ రెడ్డి కి అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ వేడుకకు ఎవరు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అనే విషయం మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు, ఎన్టీఆర్
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజమౌళి హాజరయ్యే అవకాశం ఉందని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం మీద సినిమా యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు కొరటాల శివ ఈ సినిమా ఈవెంట్కు హాజరు కావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను కోరినట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ గతంలో జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఇప్పుడు కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ బాబుతో కూడా ఆయనకు రెండు సినిమాలు చేసిన సాన్నిహిత్యం ఉంది. గతంలో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ను తీసుకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు..

కేటీఆర్ కూడా
ఇక ఈ ప్రీ రిలీజ్ వేదిక మీద రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ ను తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అని తెలుస్తోంది.అలా RRR మ్యాజిక్ మరోమారు క్రియేట్ చేయనున్నారు. సినీ పరిశ్రమ నుంచి వీరిని ఆహ్వానిస్తే మరోపక్క మంత్రి కేటీఆర్ ను కూడా ఈ ఈవెంట్ కు హాజరుకావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కూడా సినీ ఈవెంట్లకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఈ విషయం మీద రేపు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











