యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్లో మరో రికార్డ్ బ్రేకింగ్ సినిమా రాబోతోందనే సంతోషం ఓ వైపు, అదే సమయంలో చాలా రోజుల క్రితం మొదలైనా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదనే అసంతృప్తి మరో వైపు ఉంది. ఎట్టకేలకు ఆ అసంతృప్తికి తెర దించుతూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 13 నుండి ఈ మూవీ పట్టాలెక్కబోతోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న తొలి సినిమా ఇది. యంగ్ టైగర్ సరసన పూజా హెడ్గే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్ స్లిమ్గా, సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. తన కెరీర్లో ఇప్పటి ఎన్టీఆర్ పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. ఎన్టీఆర్ పోషించే పాత్ర హాస్యం పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుత జనరేషన్లో డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్తో పోటీపడే స్టార్ లేడు. అదే సమయంలో డైలాగులు రాయడంలో త్రివిక్రమ్ది అందెవేసిన చేయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే డైలాగులు ఏ స్థాయిలో ఉంటాయో ఉహించుకోవచ్చు. తనదైన పంచ్లు, ప్రాస డైలాగులతో త్రివిక్రమ్ థియేటర్లను మోతకెక్కించడం ఖాయం అంటున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వక పోవడంతో కాస్త డీలా పడ్డ త్రివిక్రమ్ ఈ సినిమాతో మళ్లీ బాక్సాఫీసు వద్ద తన సత్తాచాటుతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.