AP Elections ఏపీలో ప్రచార గడువు ముగిశాక .. హైదరాబాద్లో దిగిన ఎన్టీఆర్ ఫ్యామిలీ, యాదృచ్ఛికమా, లేదా.. ?
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతటి ప్రతిష్టాత్మకమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న సంగతి తెలుగు తమ్ముళ్లందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు సర్వశక్తులు కూడదీసుకుని జగన్తో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జనసేన, బీజేపీలు కూడా చంద్రబాబుకు అండగా నిలిచాయి. సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా అభ్యర్ధులను బరిలో దించింది టీడీపీ. చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనే 47 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా దాదాపు 90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు.
కూటమిలో భాగస్వామిగా వున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కుటుంబం మద్ధతు దండిగా లభించింది. పెద్దన్న చిరంజీవి, వదిన సురేఖ, వీరి కుమారుడు రాంచరణ్ చిన్నన్న నాగబాబు , ఆయన కుమారుడు వరుణ్ తేజ్, మేనల్లుళ్లు సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు ప్రచారంలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ కూడా పవన్కే జై కొట్టింది. నాని, సంపూర్ణేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ తదితరులు సోషల్ మీడియా ద్వారా జనసేనానికి అండగా నిలిచారు.

కానీ ఓ సినీనటుడి చేతుల్లో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఈసారి సినీగ్లామర్ కరువైందనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తూ.. కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేసినా ఏదో లోటు టీడీపీలో కనిపించింది. ఈ సారి టీడీపీ ప్రచారానికి గ్లామర్ గళం దూరంగా ఉండటం అందరిలోను చర్చ జరిగింది.
అదే జూనియర్ ఎన్టీఆర్. తాత పెట్టిన పార్టీకి ఏ అవసరమొచ్చినా ముందుంటానన్న ఆయన అనూహ్య కారణాలతో దూరమయ్యారు. ప్రచారానికి రాకున్నా కనీసం చిన్న ట్వీట్ పెట్టినా దాని ప్రభావం అసాధారణంగా ఉండేది. కానీ జూనియర్ మాత్రం ఏపీ రాజకీయాలవైపు కన్నెత్తి చూడలేదు. ఏపీలో ఎన్నికలకు మరికొద్దిగంటలే సమయం ఉండటంతో ఎన్టీఆర్ ఖచ్చితంగా స్పందిస్తారనే డిస్కషన్ ఫిలింనగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సతీమణి హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి బయల్దేరారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వారితో రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర పార్ట్ 1 షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులు తెలుగు నేలకు దూరంగా వుండి.. సరిగ్గా ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్కు తిరిగి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేవరతో పాటు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీంతో షూటింగ్ల కోసం తరచుగా ఆయన ముంబై వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్-2 షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ ముంబైలో వున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సెలబ్రెటీలతో కలిసి జూనియర్ ఓ పార్టీకి వెళ్లారు, ఆయన వెంట భార్య లక్ష్మీ ప్రణతి కూడా వున్నారు. ఇదే సమయంలో ముంబైలో ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో దుమారం రేపింది. వార్-2లో లుక్ రివీల్ కావొద్దనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారనే టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











