కె. బాలచందర్ జీవిత విశేషాలు....(ఫోటో ఫీచర్)
చెన్నై: ప్రముఖ దక్షిణాది దర్శకుడు కె. బాలచందర్ మరణం దక్షిణాది సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసింది. కె.బాలచందర్ పూర్తి పేరు కైలాసం బాలచందర్. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ యాక్టర్స్ ఆయన ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు.
భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. బాలచందర్ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జులై 9న బాలచందర్ జన్మించారు. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది.

ఎంజీఆర్ ద్వారా...
ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ప్లే అందించాడు.

వాస్తవికతకు దగ్గరగా...
ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.

నాటకాన్నే సినిమాగా...
మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన నీర్కుమిళి ని సినిమాగా తీశాడు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్ లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారాడు.

చిన్న హీరోలతోనే...
అప్పుడాయనకు పెద్ద స్టార్లతో సినిమాలు తీయమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ హీరోలు దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసుకోలేదు. సర్వర్ సుందరం (1964) కథ తయారు చేసినప్పుడు మాత్రం ఆ పాత్రకు నగేష్ అయితే చక్కగా సరిపోతాడనిపించింది. అప్పటికి ఆయన చాలా బిజీ హాస్యనటుడు. కానీ ఆయన్ని కలిసి కథ వినిపించడంతో అందుకు అంగీకరించాడు. ఆ సినిమా బాలచందర్ కు మేలిమలుపు నిచ్చింది. క్రిష్ణన్ పంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాలచందర్ దానికి మాటలు రాశాడు. ఆ చిత్ర సంభాషణలకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవకాశాలు బాగా పెరిగాయి.

ఉద్యోగం వదిలి
అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా వద్దా? అని కొన్నాళ్ళు సందేహించాడు. అయితే మెయ్యప్పన్ అనే నిర్మాత ఆయనకు ధైర్యం చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేయించడమే కాకుండా వరుసగా మూడు అవకాశాలిచ్చాడు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు.

భిన్నమైన సినిమాలు
అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధుభైరవి, ప్రమీల తో తీసిన అరంగేట్రం. సింధుభైరవి లో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసిని ది. అరంగేట్రం లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళి తో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.

రుద్రవీణ

కుటుంబం
ఆయన భార్య పేరు రాజం. వీరికి ముగ్గురు పిల్లలు. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.

పరిచయం చేసిన నటులు
కమల్ హాసన్, రజినీ కాంత్, మమ్మూట్టి, చిరంజీవి (తమిళ పరిశ్రమకు), శ్రీవిద్య, శ్రీదేవి, సరిత, వివేక్ (తమిళ హాస్య నటుడు), ప్రకాష్ రాజ్, వై. జి. మహేంద్రన్ (తమిళ నటుడు), సుజాత, చరణ్ (తమిళ దర్శకుడు), రమేష్ అరవింద్, మాధవి, జయసుధ, జయప్రద, శ్రీ ప్రియ, గీత, చార్లి (తమిళ హాస్య నటుడు), యువరాణి, విమలా రామన్, ఏ.ఆర్.రెహమాన్ రోజా సినిమాను నిర్మించిన బాలచందర్, సంగీత దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











