ఓ మంచి సినిమా కోసం ప్రయత్నం.. జెర్సీ రీమేక్ పై కబీర్ సింగ్ స్పందన
లాక్ డౌన్ మొదలయ్యేంతవరకూ ఫుల్ జోష్ మీద జర్సీ షూటింగ్ లో పాలుపంచుకున్న కబీర్ సింగ్ అదేనండీ... షాహిద్ కపూర్... ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ లో ఇరగదీసిన షాహిద్... జెర్సీ సినిమా పైనా చాలానే ఆశలు పెట్టుకున్నాడు. కానీ, అనుకోని అవరోధం ఎదురవ్వడంతో... అందరిలాగానే అబ్బాయి కూడా... చప్పుడు చేయకుండా ఇంటిపట్టున సేదతీరుతున్నాడు. ఇక సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా బాట పట్టిన నేపథ్యంలో షాహిద్ కూడా... సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా మారాడు. ఈ సందర్భంగానే జెర్సీ రీమేక్ గురించి ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.
"కబీర్ సింగ్ తరువాత జెర్సీ పై చాలానే అంచనాలు ఉన్నాయి... కాస్త ఆ వివరాలేమైనా చెప్పు గురూ" అని ట్విట్టర్ లో ఓ ఫ్యాన్ అడగగానే... ఉబ్బితబ్బిబైపోయిన షాహిద్ వెంటనే తన స్పందనను తెలియజేశాడు. "ఓ మంచి సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాం... ఇప్పటివరకూ తెరకెక్కిన దాంతో సంతృప్తిగానే ఉన్నాం... ఈ చిత్ర యూనిట్ తో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందంటూ" సమాధానమిచ్చాడు షాహిద్.

తెలుగులో శ్రద్ధా శీనాథ్ పోషించిన పాత్రలో టీవీ నటి మృణాళ్ ఠాకూర్ నటించబోతుండగా... సత్యరాజ్ పాత్రలో షాహిద్ రియల్ లైఫ్ ఫాదర్ పంకజ్ కపూర్ కనిపించబోతుండటం మరో విశేషం. సున్నితమైన ఎమోషన్స్ తో కూడుకున్న ఈ కథను ఓ ఛాలెంజ్ గా తీసుకున్నట్లు దర్శకుడు తెలిపాడు.
కబీర్ సింగ్ సూపర్ సక్సెస్ తరువాత... షాహిద్ నెక్స్ట్ రీమేక్ పై బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే లాక్ డౌన్ గనుక పొడింగించినట్లయితే... విడుదల తేదీలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











