నాగార్జున ఏం ఐడియా వేసాడు
హైదరబాద్ : ఓ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే క్రేజ్ క్రియేట్ చేయగలగాలి. నాగార్జన తన తాజా చిత్రం 'మనం' ని ఇప్పుడు తమిళంలోకి తీసుకు వెళ్తున్నారు. అక్కడ మార్కెట్లో ఈ సినిమాపై అంచనాలు పెరగటానికి కావాల్సిన జాగ్రత్తలను డబ్బింగ్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులోకి కమల్ హాసన్, మాధవన్ లని తీసుకు వచ్చి వారి చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. దాంతో కమల్ డబ్బింగ్ చెప్పించారు అంటే అక్కడ మీడియాలో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఆ రకంగా నాగార్జున ఈ చిత్రం అక్కడ ప్రమోట్ చేయబోతున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం 'మనం'. నాగార్జున, నాగచైతన్య, అఖిల్...ఇలా కుటుంబమంతా కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని తమిళంలోకి అనువదించడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. అందుకోసం అక్కినేని పాత్రకి డబ్బింగ్ చెప్పమని కమల్హాసన్ని సంప్రదించినట్లు తెలిసింది. నాగార్జున పాత్రకి డబ్బింగ్ కోసం మాధవన్తో మాట్లాడారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు 'మనం' వెళుతుంది.
మరో ప్రక్క ఈ చిత్రం లో స్వర్గీయ అక్కినేని సన్నివేశాల పై జనాలు ఆసక్తి చూపుతూండటం గమనించిన నాగార్జున... ఆయన నటించిన కొన్ని ఎగస్ట్రా సీన్స్ ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షూట్ చేసి, సినిమా లెంగ్త్ కోసం తొలిగించిన సీన్స్ ని కలపటం ద్వారా రిపీట్ ఆడియన్స్ వస్తారని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

అలాగే బాలీవుడ్ నుంచి రీమేక్ ఆఫర్స్ వచ్చాయని చెప్తున్నారు. ప్రచారంలో ఉన్నదాన్ని బట్టి... నాగార్జున పాత్రలో అమీర్ ఖాన్, నాగచైతన్య పాత్రలో రణబీర్ కపూర్ చేస్తారని, అమితాబ్...నాగేశ్వరరావు చేసిన పాత్ర చేస్తారని చెప్తున్నారు. అలాగే...ఈ రీమేక్ లో శ్రేయ పాత్రను ప్రీతిజింతా, సమంత పాత్రను కత్రినా కైఫ్ చేస్తారని చెప్తున్నారు. అయితే అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ లేకుండా ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫిల్మ్ చేయటమేంటని అంటున్నారు.
కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











