కమల్ హాసన్కు దక్కని బాలచందర్ చివరిచూపు!
చెన్నై: ప్రముఖ సీనియర్ దర్శకుడు బాలచందర్ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం మరణించారు. 84 సంవత్సరాల ఆయన గతకొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూసారు.
బాలచందర్ శిష్యుడు, సన్నిహితుడు కమల్ హాసన్కు....ఆయన చివరి చూపు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం బాలచందర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై కమల్ లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ మరణ వార్త తెలియగానే బుధవారం ఉదయం అమెరికా నుండి బయల్దేరారు. బుధవారం రాత్రికి ఆయన చెన్నై చేరుకోనున్నారు. బాలచందర్ తో కలిసి కమల్ హాసన్ దాదాపు 40 చిత్రాలు చేసారు.

ఇటీవల బాలచందర్ అనారోగ్యంతో ఉన్నపుడు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. "'ఉత్తమ్ విలన్' చాలా త్వరగా పూర్తి చేయాలని ఇటీవల బాలచందర్ సర్ నన్నడిగారు. విడుదలకముందే ఆ సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పినట్లు వెల్లడించారు'. అయితే బాలచందర్ చివరి కోరిక తీరకముందే ఆయన కన్నుమూసారు.
కాగా...కమల్ హాసన్ ఈ రోజు రాత్రికి చెన్నై చేరుకుని నేరుగా బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించనున్నారు. ఈ మేరకు కమల్ హాసన్ మేనేజర్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. బాలచందర్ మరణవార్త విని కమల్ హాసన్ షాకయ్యారని తెలిపారు.


Click it and Unblock the Notifications











