సహించాల్సిన అవసరం లేదు: అసహనం అంశంపై కమల్
హైదరాబాద్: అసహనం అంశంపై ప్రముఖ నటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన రీతిలో స్పందించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో జరిగిన ఓ సెమినార్లో ఆయన ఓ విద్యార్థి నుండి అసహనం అంశంపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అసలు ‘సహనం' అన్న పదమే సరికాదని కమల్ స్పష్టం చేసారు. ఒకరిమీద ఒకరు ‘సహనం'చూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకరినొకరు అంగీకరిస్తే చాలన్నారు. భారత భిన్న సంస్కృతుల సమాహారమని స్పష్టం చేశారు. అసలు ఒకరి మీద మనం ఎందుకు సహనం చూపించాలి? ముస్లింలను మన సహపౌరులుగా అంగీకరించాలి. వారిమీద సహనం చూపించనవసరం లేదు. అదే విధంగా హిందువులనూ అంగీకరించాలి. అప్పుడే దేశం ముందుకెళుతుంది'' అని స్పష్టం చేశారు.

వాక్స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మతం, స్వేచ్ఛ, విద్య తదితర అంశాలపై కమల్ తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. ‘మూడు రంగుల దారాలతో భారత అనే స్వెట్టర్ను అల్లారు. దాని చేతులు(పాకిస్థాన్, బంగ్లదేశ్) ఇప్పటికే పోయాయి. మిగిలి స్లీవ్లెస్ స్వెటర్లోంచి ఆకుపచ్చ ని దారాన్ని వేరు చేయడం సాధ్యంకాదు. మిగిలిన దేశాన్నైనా ఐక్యంగా, సుస్థిరంగా ఉంచేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది' అని కమల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











