వ్యక్తిగత కారణాల వల్లే వేధిస్తున్నారు: రాజమౌళి
హైదరాబాద్: విశ్వరూపం విషయమై కమల్ కు పూర్తి అండగా నిలబడ్డారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. తమిళనాడులో కమల్ హాసన్ 'విశ్వరూపం'పై నిషేధాన్ని ప్రస్తావిస్తూ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏమైపోయిందని, ప్రభుత్వం బహిరంగంగా కమల్ను ఎలా లక్ష్యం చేసుకుంటోందని రాజమౌళి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలికి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలను ప్రస్దావించారు.
రాజమౌళి మాట్లాడుతూ... ''రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఏమైపోయింది? ఆ స్వేచ్ఛ కాలువలో పారేశారా? ఏ చిత్రాన్ని అయినా శాంతిభద్రతల పేరిట నిషేధించరాదని సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను మరచిపోయారా? ప్రభుత్వాలు చట్టాలకు అతీతమా?'' అని ప్రశ్నించారు.
అలాగే పరిశ్రమలోని ఇతర ప్రముఖుల మాదిరిగానే కమల్ను వ్యక్తిగత కారణాల వల్లే వేధిస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారు. ''ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమని మొదట్లో అనుకున్నాను. కాని తరచి చూస్తే ఇది వ్యక్తిగత కక్షసాధింపు చర్యగా అర్ధమవుతోంది. కమల్ హాసన్ లాటి అగ్రనటులకు ఇలా జరగటం చాలా విచారకరం. నిజం చెప్పాలంటే విచారం కన్నా భయం ఎక్కువగా ఉంది.'' అని అన్నారు.
ఈ చిత్రాన్ని చూడాలని ఆయన ఆసక్తి కనపరచుతున్నారు. అపుడే చిత్రంలో ఎలాటి అభ్యంతరకర దృశ్యాలు లేదా సంభాషణలు ఉన్నాయి, ముస్లిం సంస్థల భావోద్వేగాలు గాయపడటానికి కారణమేమిటి, తదిత విషయాలు తెలుస్తాయని రాజమౌళిఅభిప్రాయపడ్డారు. ''మొదట్లో చిత్రపరిశ్రమలో ఇతరుల మాదిరే నాకు కూడా ఆగ్రహం బాధ కలిగాయి. ఈ చిత్ర నిషేధం ఏమి సూచిస్తున్నదా అని మీమాంసలో పడ్డాను. చిత్రంలో ఏ భాగం ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తున్నదా అనేది తెలుసుకోగోరుతున్నాను.'' అని ప్రశ్నించారు.
ఇక ఈ చిత్రం వల్ల ముస్లింల భావోద్వోగాలు గాయపడుతున్నాయన్న వాదనతో ఆయన ఏకీభవించటం లేదు. తమిళప్రభుత్వమే ముస్లింలను అవమానించుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ''తాలిబన్లు టెర్రరిస్టులు. వారిని చెడుగా చూపించటం సహజం. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే తప్పులేదు కదా. అయితే ఇలా చూపించటం వల్ల భారతీయ ముస్లింలు గాయపడతారని భావిస్తే అది ఇక్కడి ముస్లింలను అవమానించటమే. ఇపుడు ప్రభుత్వం చేస్తున్న పనిఅదే.'' అని రాజమౌళి చెప్పారు.


Click it and Unblock the Notifications











