పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన కమల్ హసన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం న్యూఢిల్లీలో కమల్హాసన్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. నటుడు కమల్హాసన్, బ్యాడ్మింటన్ ఆటగాడు పి.గోపీచంద్ సహా 12 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు అందజేశారు. నటి విద్యాబాలన్, భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్ సునీల్ దబాస్, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయిక్, సామాజిక కార్యకర్త జవహర్ లాల్ కౌల్ సహా 53 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ దర్బార్హాల్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్.ఎ.మాషేల్కర్కు రాష్ట్రపతి ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ.. ప్రధాని మన్మోహన్సింగ్ దంపతులు, పలువురు కేంద్రమంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తదితరులు హాజరయ్యారు.పద్మ విభూషణ్ అందుకున్న మాషేల్కర్ పాలిమర్ సైన్స్, ఇంజినీరింగ్లో చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయంగా పేరు సంపాదించారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ టెక్నాలజీలో సాధించిన విజయాలకు గాను అనుమోలు రామకృష్ణకు మరణానంతరం పద్మ భూషణ్ వరించింది. ఆయన గత ఏడాది మృతిచెందారు.

అయిదేళ్ల వయసులోనే చూపు కోల్పోయిన జవహర్లాల్ కౌల్ అంధుల సంక్షేమానికి పనిచేస్తున్నారు. పురస్కారం అందించేందుకు రాష్ట్రపతే పోడియం దిగి కౌల్ వద్దకు రావడం విశేషం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 127మందికి పద్మ పురస్కారాలను ప్రకటించగా అందులో 66మందికి సోమవారం అందజేశారు.
దివంగత మాజీ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.వర్మకు ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును అందుకునేందుకు ఆయన కుటుంబసభ్యులు తిరస్కరించడంతో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించే దిశగా పురస్కారాల కమిటీ పరిశీలిస్తోంది. పురస్కారాన్ని తిరస్కరించడానికి గల కారణాలు వివరిస్తూ వర్మ భార్య రాష్ట్రపతికి రాసిన లేఖను కమిటీకి అందజేస్తామని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. నిర్భయ ఉదంతం తరువాత లైంగిక దాడులపై కఠిన చట్టాలు తేవడానికి ఏర్పరిచిన ప్రభుత్వ కమిటీ వర్మ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











