ఇబ్బంది పెడితే దేశం విడిచిపోతా : కమల్ హాసన్
చెన్నై: కమల్ హాసన్ తెరకెక్కించిన 'విశ్వరూపం' చిత్రం విడుదల సందర్భంగా తమిళనాడులో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో తెలిసిందే. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆయన అప్పట్లో సంచలన ప్రకటన చేసారు. 'నన్ను మరిత ఇబ్బంది పెడితే వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో వెళ్లి పోతా' అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం విశ్వరూపానికి సీక్వెల్ గా 'విశ్వరూపం 2' చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మళ్లీ అలాంటి ఇబ్బందులు ఎదురయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ....'నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. ఎంఎఫ్ హుస్సేన్ మాదిరి విదేశాల్లో స్థిరపడతాను. ఇది బెదిరింపు కాదు..రాజీనామా. ఎక్కడికి వెళ్లినా మాతృ దేశాన్ని మరిచిపోను' అని సమాధానం ఇచ్చారు.
విశ్వరూపం 2 సినిమా వివరాల్లోకి వెళితే...విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
మేజర్ వసీం ఆహ్మద్ కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












