విక్టరీ: ప్రెస్ మీట్లో విశాల్, కార్తి, నాజర్ ఏం చెప్పారంటే...
హైదరాబాద్: తమిళ సినీ నటుల సమాఖ్య ‘నడిగర్ సంఘం' ఎన్నికల్లో విశాల్ నేతృత్వంలోని జట్టు.... శరత్ కుమార్ జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో విశాల్ వర్గం తరుపున నాజర్ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా విశాల్ విజయం సాధించారు.

గెలుపు తర్వాత నడిగర్ సంఘం కార్యవర్గం అంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపునకు తోడ్పడిన వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రధానంగా సంఘం భవన నిర్మాణం గురించి త్వరలోనే సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద రద్దు విషయాన్ని శరత్కుమార్ విలేకరుల సమావేశంలో ప్రకటించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ చేతికి అందగానే తదుపరి చర్యలపై చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే దక్షిణ భారత నటీనటుల సంఘం ట్రస్టీగా వ్యవహరించడానికి నటుడు కమలహాసన్ అంగీకరించారని విశాల్ తెలిపారు.
సంఘం కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన నటుడు కార్తీ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో బాధ్యతలను పంచుకున్నామని చెప్పారు. ముందుగా రంగస్థల నటుల వివరాలను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రంలోని ఊరూరా తిరిగి వారి స్థితిగతులను తెలుసుకుని ఆర్థిక సాయం, వైద్య సేవలు, పిల్లలకు విద్యాసాయం తదితర అంశాల గురించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నడిగర్ సంఘానికి హీరో సూర్య రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ప్రస్తుతం సంఘానికి 29 లక్షల 37 వేల 17 రూపాయల 84పైసలతో పాటు 87 లక్షల 75 వేలు బ్యాంక్ డిపాజిట్ మాత్రమే ఉందన్నారు. ఈ వ్యవహారంలో పూర్తిగా ఆడిటింగ్ జరపాల్సి ఉందన్నారు. సంఘం భవన నిర్మాణం కోసం స్టార్ నైట్ కార్యక్రమాలు లాంటివి చేస్తామని చెప్పారు. యువ నటులంతా కలిసి ఓ చిత్రంలో నటించి దాని ద్వారా నిధిని రాబడతామని, అలాగే స్టార్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని సంఘ కార్యదర్శి విశాల్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











