టీవి షోలతో దెబ్బ :నేటి నుంచి సినీ నిర్మాతల సమ్మె
బెంగళూరు: కర్ణాటకకు చెందిన సినీ నిర్మాతలు సోమవారం నుంచి సమ్మె చేయనున్నారు. ఉదయం కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎదుట ధర్నాలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో వాణిజ్య మండలి పదాధికారులు ఆదివారం సమావేశమై చర్చించారు. సమ్మెను విరమింపచేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నటులు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకులే కరవయ్యారనేది నిర్మాతల ప్రధాన ఆరోపణ. దీంతో పాటు టెలివిజన్ ఛానళ్లు సినిమాల్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. సోమవారం నుంచి షూటింగ్ లు ఆగిపోనున్నాయి.

ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలోనూ...
బుల్లితెరపై నటులు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారని చలన చిత్ర వాణిజ్య మండలికి కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈగ ఫేం నటుడు కన్నడ హీరో సుదీప్ వద్ద ప్రస్తావించగా, 'దానికి సంబంధించి నాకు ఇంత వరకు ఎటువంటి నోటీసు అందలేదు, వారు వివరణ అడిగితే అప్పుడే స్పందిస్తానని' ఆయన పేర్కొన్నారు.
చలన చిత్రాల్లో నటనకు, టీవీ ప్రకటనల్లో నటనకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. సమయాభావం కారణంగానే తానే ప్రచార చిత్రాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బుల్లితెరపై హీరోల రియాలిటీ ప్రదర్శనలకు కళ్లెం వేయాలంటూ నిర్మాతలు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశారు. సుదీప్, రమేష్ అరవింద్, గోల్డెన్స్టార్ గణేష్లు వివిధ ఛానళ్లలో వారాంతాల్లో రియాలిటీ ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల కన్నడ సినిమాల్ని వీక్షించే ప్రేక్షకులే కరువయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిర్మాతల ఫిర్యాదుపై స్పందించేందుకు నటులు నిరాకరించారు. మండలి నుంచి నోటీసు వస్తే అప్పుడు చూస్తామని సమాధానమిచ్చారు. నిర్మాతల ఫిర్యాదుపై చర్చించేందుకు మంత్రి, నటుడు అంబరీష్తో సమావేశం కావాలని నటీనటులు తీర్మానించారు. తెలుగులోనూ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఉందని ఇక్కడ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ చెప్పుకుంటున్నారు. మన హీరోలు వీకెండ్ లలో టీవీ షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











