ఉంచుకుంటాం...తుంచుకోం: టాలీవుడ్పై కేసీఆర్

మీట్ ది ప్రెస్లో కేసీఆర్ మాట్లాడుతూ...'కారణాలే ఏమైనా కావొచ్చు... తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో కేంద్రీ కృతమైంది. దానిపై ఎంతో మంది ఆధార పడి ఉన్నారు. అలాంటి పరిశ్రమను ఉంచుకుంటామే తప్ప తుంచుకోం. మరింత అభివృద్ధి చేసుకుంటాం' అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. విభజన తర్వాత పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆందోళనలో ఉన్న వారికి ఈ ప్రకటన కాస్త ఊరట నిచ్చినట్లయింది.
కాగా తెలంగాణ ప్రకటన తర్వాత మొదలైన సమైక్య ఉద్యమం కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు సమైక్య వాదులు సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమైక్య వాదుల హెచ్చరికలతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడ్డాయి.
జులై 31న విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం ఆగస్టు 21కి వాయిదా వేసారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ఆగస్టు 21న కూడా విడుదలవ్వడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా సమైక్య వాదుల హెచ్చరికలతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈచిత్రం ఆగస్టు 9న విడుదల కావాల్సి ఉండగా....ఆగస్టు 14కు వాయిదా వేసే యోచనలో ఉన్నారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకుండా మరికొంత కాలంగా విడుదల నిలిపి వేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











