సర్వేకు నిరాకరణ: పవన్ కళ్యాణ్పై కెసిఆర్ కామెంట్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ఇక్కడుండాలనుకోవడం లేదేమో అని కేసీఆర్ విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని, ప్రజలు మహాద్భుతాన్ని ఆవిష్కరించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. మంగళవారం రోజంతా సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ గడిపిన ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా వివరాలు ఇవ్వడం ఫేస్బుక్లో చూశానని అన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ సర్వేను తిరస్కరించారని ఒక విలేకరి చెప్పగా, ఆయన ఇక్కడ ఉండాలనుకోవడం లేదేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టూరిస్టుల మాదిరిగా ఉండి, వెళ్లాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొని ఉండకపోవచ్చని అన్నారు. ఇక్కడ నివసిస్తూ... తాగునీరు, లైట్లు, రోడ్లు తదితర ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ ప్రభుత్వసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించడం సామాజిక నేరం.. అని కేసీఆర్ విమర్శించారు.

తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ సహకరించలేదు. అదేవిధంగా, మాజీ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాములమ్మ కూడా వివరాలను ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
వారి నుంచి మరోసారి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని హైదరాబాదులోని వారి ప్రాంతాలకు వెళ్లిన ఎన్యుమరేటర్లు చెప్పినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విజయశాంతి కూడా కెసిఆర్పై నిప్పులు చెరిగారు.


Click it and Unblock the Notifications











