పవన్ కళ్యాణ్ చిత్రంపై... కెసిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ చిత్రం గురించి చర్చించేందుకు 'జైబోలో తెలంగాణ' చిత్ర దర్శకుడు ఎన్. శంకర్, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న మరో దర్శకుడు ఆర్. నారాయణ మూర్తితో శుక్రవారం కెసిఆర్ భేటీ అయ్యారు.
రాంబాబు చిత్రం గురించి దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ... సినిమా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్న మాట నిజమే అన్నారు. మహిళలు, వికలాంగులపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఈ చిత్రంపై కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగులు, సన్నివేశాలు..... కెసిఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ తీరును కించ పరిచే విధంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల ఈ చిత్రం రీళ్లను దగ్ధం చేయడంతో పాటు, ప్లెక్సీలు, కటౌట్లు, పోస్టులు ధ్వంసం చేసారు.
మరో వైపు హైదరాబాద్లో ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీసుపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై కూడా కొందరు దాడికి ప్రయత్నించారు. ఈ ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈచిత్ర ప్రదర్శన నిలిపి వేసారు.
మరో వైపు.... దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచేందుకు ఈచిత్రాన్ని రూపొందించలేదని, ఎవరినైనా ఇబ్బంది పెట్టే అంశాలు చిత్రంలో ఉంటే వెంటనే తొలగిస్తామని చెప్పారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా అలాంటి సీన్లను తొలించిన తర్వాతే సినిమా ప్రదర్శిస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై కూడా తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ గడ్డపై పుట్టి... తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సినిమాను ఎందుకు అడ్డుకోలేదని, సినిమా చూడకుండానే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నావా? అంటూ ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











