‘సౌందర్యను హత్య చేయించిది మోహన్ బాబే.. ఆయనతో నాకు ప్రాణహాని’
టాలీవుడ్ లెజెండ్ మంచు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వివాదం వెళ్లింది. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు కూడా భాగమయ్యారు. అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరంగా మోహన్ బాబుపై ఓ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆరోపణలు చూస్తే తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. పబ్లిసిటీ కోసం ఈ కేసు నమోదై ఉంటుందనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా దిగ్గజ నటుడు మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. సినీ నటి, స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక 6 ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష్య పెంచుకొన్నారు. 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడి హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు. సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడు అని తన ఫిర్యాదులో తెలిపారు.
మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమిని అనాథ ఆశ్రమానికి గానీ, లేదా మిలిటరీ సోదరులకు గానీ, పోలీసులకు గానీ, మీడియా మిత్రులకు గానీ ఇవ్వాలని కోరుతున్నాను అని ఖమ్మం ఏసీపీకి, అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్కు చిట్టిమల్లు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

అంతేకాకుండా అలాగే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మంచు మనోజ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే జల్పల్లిలోని 6 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌజ్ను స్వాధీనం చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే నాకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది. కాబట్టి తగు రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉండటంతో ఈ ఫిర్యాదును పబ్లిసిటీ స్టంట్గా భావిస్తున్నారు. అయితే ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్, ఏసీపీ, మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావుకు ప్రచారం చేసేందుకు బెంగళూరుకు బయలు దేరిన ఆమె హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో ఆమె సోదరుడు కూడా మృత్యువు పాలయ్యాడు. ఈ విషాద ఘటన సినీ పరిశ్రమను కుదిపేసింది.


Click it and Unblock the Notifications











