‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులకే సినిమాలో తాము ఉన్నామా లేదా అనేది బిగ్ స్క్రీన్ పై చూసుకునే దాకా క్లారిటీ ఉండదు. మరి చిన్న నటుల పరిస్థితి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తాజాగా కిషోర్ కుమార్ పొలిమేర అనే యాక్టర్ వెల్లడించారు. భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాల్లో తాను నటించాక తీసేసారని అన్నారు కిషోర్. మరి ఈ నటుడు విషయంలో ఎందుకలా జరిగింది అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటేనే నిలదొక్కుకోగలం అనేది కొంతమంది నటీనటుల మాట. చాలా వరకు అదే నిజం కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ తాను కొన్ని మంచి సినిమాల్లో కనిపించే అవకాశాన్ని ఎలా కోల్పోయాడో వివరించారు. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించాక తన క్యారెక్టర్ లో లేకుండా చేశారని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను వివరించారాయన.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్, ఆచార్యలో నటించాను. కానీ భీమ్లా నాయక్ సినిమాలో ఒకరోజు షూటింగ్ జరిగిన తర్వాత తన రోల్ ను ఇంకొకరితో రీప్లేస్ చేశారనే షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు కిషోర్. నటించాక కూడా ఆ సినిమాల్లో తాను లేకపోవడం బాధగా ఉందని అన్నారు.
ఆ రెండు సినిమాల్లో ఎందుకలా జరిగింది అంటే ఆ సినిమా షూటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చిందని, ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ కొంత మంది నటులను రీప్లేస్ చేశారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను షూటింగ్ లో పాల్గొన్న తరువాత కూడా అవకాశాన్ని కోల్పోయాను అని అన్నారు.
ఆ తర్వాత చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీలో కూడా ఇలాగే జరిగిందని కిషోర్ వివరించారు. ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చిందని, దాదాపు 20 రోజులపాటు ఆ సినిమా కోసం పని చేశానని కిషోర్ గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ బాగా నటించావు అని ప్రశంసించడంతో పాటు భుజం మీద చేయి వేసి మరీ ఆప్యాయంగా మాట్లాడేవారని, కానీ తీరా చూస్తే సినిమాలో తను నటించిన సన్నివేశాలు లేవని అన్నారు కిషోర్.
సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వసాధారణమని, ఒకప్పుడు తెగ బాధపడే వాడిని కానీ ఇప్పుడు అలవాటైపోయిందని ఆచార్యలో తన సీన్స్ డిలీట్ అవ్వడం గురించి కిషోర్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే సినిమాలో తను లేకపోయినా మెగాస్టార్ చిరంజీవితో గడిపిన ఆ మెమొరబుల్ టైం తనకు చాలా ప్రత్యేకమని ఈ సందర్భంగా కిషోర్ కుమార్ పేర్కొన్నారు.
ఇక సినిమా సినిమాకు రోల్ ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది అని, ఛాలెంజింగ్ రోల్ చేయాలని ఉందంటూ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు కిషోర్ కుమార్ పొలిమేర. కాగా కిశోర్ కుమార్ పొలిమేర మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఆ పాత్ర ద్వారానే కిషోర్ కుమార్ పొలిమేరగా గుర్తింపు దక్కించుకున్నాడు ఈ నటుడు.


Click it and Unblock the Notifications











