ఎన్టీఆర్ లేకుండానే మొదలు పెడుతున్న కొరటాల శివ
హైదరాబాద్: శ్రీమంతుడు ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 25 నుంచి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ జరగుతుందని వినపడుతోంది.
నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది.
‘శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ వారు ఎన్టీఆర్-కొరటాల సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 25న జూబ్లీ హిల్స్ లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో సినిమా ప్రారంభోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొరటాల శివ చెప్పిన స్క్రిప్టు జూ ఎన్టీఆర్ కి ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.

ప్రస్తుతం కొరటాల శివ హాలీడే నిమిత్తం ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ వారాంతంలో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు. మరో వైపు ‘నాన్నకు ప్రేమతో' షూటింగులో భాగంగా స్పెయిన్ లో ఉన్న ఎన్టీఆర్ అక్టోబర్ 27న హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎన్టీఆర్ లేకుండానే సింపుల్ గా ముహూర్తం షాట్ తో సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు దర్శకుడు కొరటాల శివకు భారీగా రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











