కోట శ్రీనివాసరావు కొడుకు మృతి..అంతటా విషాదం

వెంకట సాయిప్రసాద్ తన స్పోర్ట్స్ బైక్ పై శంషాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కోట ప్రసాద్ భార్య, పిల్లలు, స్నేహితుడి కుటుంబంతో కలిసి ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఫిలింనగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్ కు బయల్దేరారు. ప్రసాద్ తన 1000 సీసీ స్పోర్ట్స్ బైకు(ఏపీ0938 డీఎక్స్-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. మిగతా వారంతా కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగురోడ్డుపైకి దూసుకొచ్చింది. బైక్ పై వేగంగా వెళుతున్న ప్రసాద్ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో బైక్ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో ప్రసాద్ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడ్డారు. ఆయన తలకు తీవ్ర గాయాలై మరణించారు.
కోట ప్రసాద్ సినీ పరిశ్రమలో వర్ధమాన నటుడిగా ఎదుగుతున్న సమయంలో అకాల మృత్యువు కాటేయటం జీర్ణించుకేలని విషయం. ఇటీవల జగపతి బాబు హీరోగా విడుదలైన సిద్ధం సినిమాలో ఆయన నటించారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న గాయం-2లో ప్రసాద్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన మృతికి ధట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











